'రోడ్లపై తిరగడం ఎందుకు, అవసరమైతే జగన్కు ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తాం'
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శనివారం నిప్పులు చెరిగారు. టీడీపీపై విమర్శలు చేయడమే జగన్ పనిగా పెట్టుకున్నారన్నారు. అమరావతిని భ్రమరావతి అని జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారన్నారు.
అమరావతిలో ఏ శుభకార్యం జరిగినా జగన్ హాజరుకాన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. వాటిని అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు నిరంతరాయంగా జరుగుతున్నప్పటికీ జగన్ విమర్శలు చేస్తున్నారన్నారు.
సాగునీటి రంగంపై ఆయనకు పూర్తిగా అవగాహనలేదని దేవినేని ఎద్దేవా చేశారు. ఈ రంగంపై జగన్కు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో నీరు చెట్టు కింద పెద్ద ఎత్తున జల సంరక్షణ చర్యలు చేపట్టడం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ఆ ఫలాలనే వైసీపీ నేతలు అనుభవిస్తున్నారన్నారు.
పులిచింతల నీళ్లు ఎక్కడకు వెళ్తున్నాయో జగన్కు తెలియదని, రాష్ట్ర ప్రతిపక్ష నేతకు ప్రశ్నించే తత్వమే లేదన్నారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై పోరాడాల్సిన వ్యక్తి రోడ్లపై తిరుగుతూ మాట్లాడుతున్నారన్నారు. అవినీతిలో కూరుకుపోయి ఆయనకు అంతా అవినీతే కనిపిస్తోందన్నారు. నాలుగేళ్లలో నీటి పారుదల ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం 54 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.
ప్రభుత్వంపై బురద జల్లేందుకే ప్రతిపక్ష పార్టీలు ఫ్యాక్ట్ షీట్ విడుదల చేశాయన్నారు. జూన్ 18 తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించి డయా ఫ్రామ్ వాల్ను జాతికి అంకితం చేస్తారన్నారు. వైసీపీ మూడేళ్లుగా రాజీనామా డ్రామాలు ఆడిందని, ఇప్పటికీ వాటిని ఆమోదించుకోలేక పోయారన్నారు. ఎన్నికలు రావనే ధైర్యం తో ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారన్నారు. కేసుల నుంచి బయటపడేందుకే ఈ డ్రామాలు అన్నారు.