కార్తిక మాసంలో ఈ పత్రాలతో శివపూజ - అష్టైశ్వార్యాలు సొంతం..!!
పరమ పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమైంది. తొలి సోమవారం కావటంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంలో నదీ స్నానం.. శివార్చన కు ప్రత్యేకత ఉంది. కార్తికమాసంలో బిల్వ దళంతో శివుని అర్చిస్తే మూడు జన్మల్లో చేసిన పాప దోషాలు తొలగిపోతాయని నమ్మకం. కార్తిక మాసంలో బిల్వ పత్రాలతో నిత్యం శివ పూజ చేయడం ద్వారా అనంత కోటి పుణ్యఫలాలు దక్కుతాయని విశ్వసిస్తారు. దీంతో, భక్తుల పూజలు.. అభిషేకాల కోసం ఆలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసారు.
భక్తుల రద్దీ
కార్తీక మాసం తొలి సోమవారం వేళ శివాలయాల్లో భక్తులు బారులు తీరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో భక్తులు కనిపిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో రాత్రి వరకు నిరంతర దర్శనం కల్పిస్తున్నారు. మహిళ భక్తులు ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ పరిసరాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగిపోయాయి. కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో పూజకు ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు. కార్తిక మాసంలో బిల్వ పత్రాలతో నిత్యం శివ పూజ చేయడం ద్వారా అనంత కోటి పుణ్యఫలాలు దక్కుతాయని శివమహాపురాణం చెబుతోంది.

ఐశ్వర్య ప్రాప్తి
శ్రీ మహాలక్ష్మీ దేవి మారేడు దళాలలో స్థిరనివాసం ఉంటుంది. అందుకే కార్తిక మాసంలో శివుని మారేడు దళాలతో పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందనేది విశ్వాసం. ఈ పత్రాలతో శివుడిని పూజించేందుకు భక్తులు ప్రాధాన్యత ఇస్తున్నారు. పంచారామ క్షేత్రాలు శివన్నామ స్మరణతో మారు మోగుతున్నాయి. పంచారామ క్షేత్రమైన పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దర్శనానికి వేకువజాము నుంచి భక్తులు బారులుదీరారు. మూలవిరాట్కు అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. దీపాలు వెలిగించి హరిహర మహాదేవ అంటూ వేలాది మంది భక్తులు శివ నామస్మరణ చేస్తున్నారు. భీమవరంలోని శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అర్చకులు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

గోదావరి తీరాన
వశిష్ట గోదావరి తీరాన శివ నామస్మరణం తో భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు. పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. పుణ్య స్నానాలు చేసి గోదావరిలో కార్తీక దీపాలు విడిచి పెట్టి పూజలు చేస్తున్నారు. రాజమండ్రి పుష్కర ఘాట్కు భక్తులు పోటెత్తారు. శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక, పలు ప్రాంతాల్లోని శివాలయాల్లోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆలయ ప్రాంగణాల్లో కార్తీక దీపాలు దర్శనమిస్తున్నాయి. అన్ని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు శ్రీ శ్రీకాళహస్తి ఆలయంలో చవిత వేడుకలు నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications