పోలీసులపై దాడి బాధాకరం...క్వారీల్లో తనిఖీలు:డీజీపీ ఆర్పీ ఠాగూర్
కడప:ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాగూర్ ఆదివారం రాయలసీమ జిల్లాల ఎస్పీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా రాపూరు స్టేషన్ ఘటనపై స్పందించారు. పోలీసులపై జనాలు దాడి చేయటం బాధాకరమన్నారు.
రాపూరు ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని డీజీపీ ఠాగూర్ సూచించారు. కర్నూలు క్వారీ పేలుడు, రాయల సీమలో ఫ్యాక్షన్ నివారణ, ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదిదర అంశాలపై పోలీసు అధికారులతో చర్చించినట్లు డీజీపీ ఆర్పీ ఠాగూర్ వెల్లడించారు.
కర్నూలు క్వారీ ఘటన నేపథ్యంలో నాలుగు జిల్లాల పరిధిలో మైనింగ్ క్వారీలపై తనిఖీలు చేపడతామని డిజిపి చెప్పారు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్, ఫైర్ శాఖ సహాయంతో ఈ తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. ఎవరైనా అక్రమ లైసెన్స్ కలిగి ఉన్నట్లయితే క్వారీలను మూసివేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని డిజిపి హెచ్చరించారు.
మరోవైపు కడప జిల్లా వ్యాప్తంగా శనివారం ఆరు పోలీసు సబ్ డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన రక్షిత (షీ-టీమ్స్)ను శనివారం ఎస్పీ బాబూజీ తన కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కేవలం మహిళల కోసం రక్షితను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైతే ఎక్కువగా మహిళలుంటారో అక్కడ వీరి నిఘా ఉంటుందన్నారు. ముఖ్యంగా కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు తదితర చోట్ల రక్షిత సిబ్బంది ఉంటారని చెప్పారు. ఎవరైన ఈవ్టీజింగ్, ర్యాగింగ్ చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తే రక్షిత సిబ్బంది క్షణాల్లో చేరిపోతారు. ఆకతాయిల తాట తీస్తారని తెలిపారు.
జిల్లాలోని మహిళలే కాకుండా చిన్నారులు, యువతకు కొండంత అండనిచ్చేందుకు రక్షిత బృందం సిద్ధంగా ఉందన్నారు. మీ పట్ల ఎవరైనా ఏ చిన్న తప్పిదం చేసినా ఒక్క ఫోన్కాల్ చేస్తే చాలు అక్కడ వాలిపోతామన్నారు. ఈవ్టీజింగ్, ర్యాగింగ్, బాల్య వివాహాలు, అత్యాచారాలు, వరకట్న వేధింపులు సమస్య ఏదైనా సరే మహిళలు బాలలు ఎవరైనా సరే మేమున్నామంటూ భరోసా కల్పించేందుకు రక్షిత బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వారందరికీ ప్రత్యేకమైన దుస్తులతో పాటు ఒక్కో డివిజన్కు ఒక్కో వాహనం చొప్పున ఆరు ప్రత్యేక వాహనాలను కేటాయించి వాటిని ప్రారంభించారు. అనంతరం గోడపత్రాలను అవిష్కరించారు.