ముద్రగడతో వెళ్లి కేసుల్లో ఇరుక్కోవద్దు: డీజీపీ, రెచ్చగొడితే సహించేది లేదు: చినరాజప్ప
ముద్రగడ తలపెట్టిన పాదయాత్రకు ఎలాంటి అనుమతులు లేవని డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు.
హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. అయితే మునుపటి లాగే ఆయన పాదయాత్రకు విఘాతం కలిగే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తోకలు కట్ చేస్తారా?, ఏ సెంటరైనా తేల్చుకుందాం: బాబుపై ముద్రగడ ఆగ్రహం
ముద్రగడ పాదయాత్రపై తాజాగా ఏపీ డీజీపీ సాంబశివరావు స్పందించిన తీరు ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. పాదయాత్ర నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మూడు జిల్లాల పోలీసు అధికారులతో డీజీపీ సమావేశం నిర్వహించారు. ముద్రగడ పాదయాత్ర అంశంపైనే విస్తృతంగా చర్చించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు.
ముద్రగడ తలపెట్టిన పాదయాత్రకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. కాబట్టి యువతరం దీనికి దూరంగా ఉండి తమ భవిష్యత్తును కేసుల్లో ఇరుక్కోకుండా చూసుకోవాలన్నారు. ముద్రగడ తలపెట్టిన గత ఆందోళనల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగినందునా.. ఇప్పుడాయన పాదయాత్రకు అనుమతినవ్వడం లేదని తెలిపారు.
మరోవైపు హోంమంత్రి చినరాజప్ప ముద్రగడ పాదయాత్రపై మరోలా స్పందించారు. ఆయన గనుక పాదయాత్రకు దరఖాస్తు చేసుకుంటే.. పోలీసులే దగ్గరుండి పాదయాత్ర చేయిస్తారని ఆయన పేర్కొనడం గమనార్హం. కానీ ఉద్యమాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు.
పాదయాత్రకు అనుమతివ్వబోమని ఓవైపు డీజీపీ చెబుతుంటే.. దరఖాస్తు చేసుకుంటే పోలీసులే దగ్గరుండి పాదయాత్ర చేయిస్తారని హోంమంత్రి చెప్పడం విచిత్రంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.