తొలకరి వర్షాలతో ఆ ప్రాంతాల్లో సంబరం.. రాయలసీమ జిల్లాలలో వజ్రాల అన్వేషణ ఆరంభం!!
తొలకరి వర్షాల కోసం ఆ ప్రాంత ప్రజలు ఆశగా ఎదురు చూస్తుంటారు. తొలకరి జల్లులు కురిస్తే రాయలసీమ రైతులు ఏరువాకా సాగాలని భావిస్తారని అనుకుంటే తప్పులో కాలేసినట్టే. తొలకరి వర్షాలు కురిస్తే చాలు రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురం జిల్లాలలో ప్రజలు వజ్రాల కోసం వేట మొదలు పెడతారు. అదృష్టలక్ష్మి వజ్రాల రూపంలో తలుపు తడుతుందేమో అని ఆశగా వెదుకుతుంటారు.
కర్నూలు, అనంతపురం జిల్లాలలో మొదలైన వజ్రాల వేట
ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన కారణంగా ఏర్పడిన అసని తుఫాను ప్రభావంతో అడపా దడపా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు జనం రంగంలోకి దిగారు. వజ్రాలు దొరికే అనంతపురం, కర్నూలు జిల్లాలలో ప్రజలు చాలా మంది పిల్లాపాపలతో వజ్రాల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. పత్తికొండ నియోజకవర్గంలో ఇప్పటికే జనాలు వజ్రాల వేటలో నిమగ్నమయ్యారు. రోజంతా పొలంలోనే ఉండి తళతళ మెరిసే రాళ్ల కోసం, వజ్రాల కోసం వెదుకులాట ప్రారంభించారు. వజ్రం బరువు, రంగు, జాతిని బట్టి క్యారెట్ లలో లెక్కగట్టి డబ్బులు ఇస్తారు.
స్థానికులే కాదు, ఇతర ప్రాంతాల నుండి వజ్రాల కోసం అన్వేషణ
వజ్రాల కోసం అన్వేషణ ప్రతీ సంవత్సరం జరిగేదే అయినా ఈ సంవత్సరం కాస్త ముందుగా వజ్రాల వేట ప్రారంభించారు. స్థానికంగా ఉండే ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా ప్రజలు వజ్రాల అన్వేషణ కోసం వస్తున్నారు. వారు కూడా వజ్రాల వేట ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక వజ్రాల వ్యాపారులు రాయలసీమ జిల్లాలలో మకాం వేసేందుకు వస్తున్నారు. గతంలో కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పగిడిరాయి, బొల్లవానిపల్లె పొలాల్లో ఇద్దరికి రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. ఇక అనంతపురంలోనూ అనేక మంది రైతులకు వజ్రాలు లభించాయి.
గతేడాది ఓ రైతుకు అత్యంత ఖరీదైన వజ్రం లభ్యం
ఇక గతేడాది చిన్న జొన్నగిరికి చెందిన ఒక రైతుకు అత్యంత ఖరీదైన వజ్రం లభించింది. ఒక కోటి 20 లక్షల రూపాయల విలువైన వజ్రం సదరు రైతుకు దొరికింది. ఇప్పటివరకు ఆ ప్రాంతంలో దొరికిన వజ్రాలలో ఇదే అత్యధిక ధర పలికిన వజ్రం. ఇక ఇప్పటికే రాయలసీమ జిల్లాలలో వజ్రాలు లభిస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నిక్షేపాల కోసం అన్వేషణ సాగించింది. చివరకు రాయలసీమలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లుగా గుర్తించింది. 2013లో బంగారం నిక్షేపాల వెలికితీతకు జియో మైసూర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అనుమతి ఇచ్చింది.
ప్రతి ఏడూ వజ్రాల వేటతో వ్యవసాయానికి ఇబ్బంది
ఇదిలా ఉంటే వజ్రాల కోసం జరుగుతున్న అన్వేషణలో వ్యవసాయ భూములలో రైతులను పనులు చేసుకోలేని పరిస్థితి నెలకొంటుంది. దుక్కి దున్ని విత్తనాలు విత్తుకోవాలి అని భావించే రైతులు, వజ్రాల కోసం జనాలు పొలాలలో చేస్తున్న అన్వేషణ లతో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఏడు వజ్రాల కోసం జరుగుతున్న వేట వ్యవసాయం చేయాలనుకుంటున్న రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. మొత్తానికి ఈ ఏడాది వజ్రాల వేట ప్రారంభించిన వారిలో ఎవరి అదృష్టం పండుతుందో వేచి చూడాల్సిందే.