చంద్రబాబు పై మమతా బెనర్జీ సంచలనం - సీఎంగా పెగాసస్ కొన్నారు : జగన్ పై నిఘా పెడితే..!!
దేశాన్ని ఒక కుదుపు కుదేసిన పెగాసస్ వ్యవహారం ఇప్పుడు ఏపీలో చర్చకు కారణమైంది. ఈ విషయం పైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వివాదాస్పద పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రతిపక్ష పార్టీలపైన నిఘా పెట్టేందుకు దీనిని కొనుగోలు చేస్తున్నారంటూ జాతీయ స్థాయిలో కొంత కాలం క్రితం వివాదాస్పదమైంది. రాజకీయ రగడకు కారణమైంది. సుప్రీం కోర్టు వరకు ఈ వ్యవహారం వెళ్లింది. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా పలువురి ఫోన్లు ట్యాప్ చేసారనేది నాటి ఆరోపణ. అయితే, ఇప్పుడు ఈ అంశం పైన తాజాగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేసారు.
Recommended Video


చంద్రబాబు పెగాసస్ కొన్నారు..
బెంగాల్ అసెంబ్లీ వేదికగా సీఎం పెగాసస్ పైన మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివాదాస్పద పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారని మమతా వెల్లడించారు. నాలుగైదేళ్ల క్రితం పెగాసస్ సాఫ్ట్ వేర్ ను రూ 25 కోట్లకు విక్రయిస్తామంటూ దాని రూపకర్తలు బెంగాల్ పోలీసులను సంప్రదించారని చెప్పారు. విషయం తనకు తెలిసిన వెంటనే తిరస్కరించానని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు దానిని కొనుగోలు చేసిందని మమతా వివరించారు. అప్పట్లో వైసీపీ నేతలు టీడీపీ ప్రభుత్వం ఇదే అంశం పైన ఆరోపణలు చేసారు. కానీ, టీడీపీ వాటిని ఖండించింది.

కొనుంటే జగన్ అధికారంలోకి వస్తారా
తాజాగా, మమతా బెనర్జీ వ్యాఖ్యల పైన నాటి ప్రభుత్వంలో మంత్రి..టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ స్పందించారు. పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేయాల్సిందిగా డెవలపర్లు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారని...కానీ, ప్రభుత్వం తిరిస్కరించిందని చెప్పుకొచ్చారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలను ఎప్పుడూ చంద్రబాబు పోత్సహించలేదని స్పష్టం చేసారు. అయితే, మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల పైన స్పందిస్తూ.. ఏదో తప్పుడు సమాచారంతోనే అలా మాట్లాడి ఉంటారంటూ లోకేష్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. పెగాసెస్ సాఫ్ట్వేర్ను తెలుగుదేశం ప్రభుత్వం కొనుగోలు చేయలేదని తేల్చిచెప్పిన ఆయన.. ఆ సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి ఉంటే జగన్ అధికారంలోకే వచ్చేవారా అంటూ ప్రశ్నించారు.

జగన్ ప్రభుత్వ బయట పెట్టేది కాదా
అధికారంలోకి వచ్చిన వెంటనే ఐటీ సహా అన్ని శాఖలకు సంబంధించిన ఫైళ్లను జగన్ తనిఖీలు చేయించారని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం ఆ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసి ఉంటే జగన్ ప్రభుత్వం దానిని బయట పెట్టకుండా..తమ పై చర్యలు తీసుకోకుండా ఉంటుందా అని లోకేష్ ప్రశ్నించారు. అయితే, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తమ కీలక నేతలు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ వైసీపీ ముఖ్య నేతలు నాటి ప్రభుత్వం పైన ఆరోపణలు చేసారు. కానీ, టీడీపీ ప్రభుత్వం అప్పట్లో ఆ ఆరోపణలను తప్పు బట్టింది. ఇక, ఇప్పుడు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. లోకేష్ ఇప్పటికే మమతా చేసిన వ్యాఖ్యలు తప్పుడు సమాచారంతో చేసినవిగా పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ దీని పైన ఎలాంటి స్పష్టట ఇస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications