మోడీపై జగన్ది వ్యక్తిగతం, కిరణ్ గురించి అడగొద్దు: డిగ్గీ
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పాలనాదక్షుడన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ మంగళవారం అభిప్రాయపడ్డారు.
ఆయన న్యూఢిల్లీలో మాట్లాడారు. మోడీపై జగన్ వ్యాఖ్యలు ఆయన అభిప్రాయం కావొచ్చని డిగ్గీ చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విషయమై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. ముఖ్యమంత్రి గురించి, సిడబ్ల్యూసి గురించి తనను అడగవద్దని చెప్పారు. త్వరలో ఆంటోని కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుందన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై సుదర్శన్ రెడ్డి
రాష్ట్ర విభజన జరిగితే నీటి యుద్ధాలు ఏమీ రావని, అవన్నీ కొందరి అపోహలు మాత్రమేనని భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించడం లేదని వాస్తవాలను చెబుతున్నానన్నారు.
విభజనతో నీటి యుద్ధాలు అనేది వట్టిదే అన్నారు. తుంగభద్ర నుండి రాయలసీమకు 93 టిఎంసీలు వెళ్తోందని చెప్పారు. విభజన జరిగినా వేటి కేటాయింపులు వాటివే అన్నారు. కేటాయింపుల ఆధారంగానే అన్ని ప్రాంతాలకు నీటిని అందిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications