రాష్ట్రంలో పరిస్థితి చక్కదిద్దండి!: కిరణ్కు దిగ్విజయ్ ఫోన్
హైదరాబాద్: సీమాంధ్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున వెంటనే చొరవ తీసుకొని సద్దుమణిగేలా చూడాలాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆదేశించినట్లుగా సమాచారం.
దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రికి ఫోన్ చేశారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి తిరుపతిలో ఉన్నారు. లోగడ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న ప్రకారమే రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకోవడం జరిగింది, కాబట్టి ఇప్పుడు ఆందోళనలు జరగకుండా చూడాలని దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రికి సూచించినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు సీమాంధ్రలో సమైక్య ఉద్యమం కొనసాగుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని మున్సిపల్ మాజీ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్పై శనివారం రాత్రి కొందరు దాడి చేశారు. ఫర్నిచర్ను ధ్వంసం చేసి అందులో పనిచేస్తున్న ఇరువురు సిబ్బందిపై దాడి చేశారు.
నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి శిబిరం సమీపంలో ఈ సంఘటన జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దివాకర్ ట్రావెల్స్లో పనిచేస్తున్న కుళ్లాయప్ప, మురళీ కృష్ణలు ఇంటి తాళం చెవి కోసం షట్టర్ తీస్తుండగా దీక్షా శిబిరం వద్ద ఉన్న కొందరు ట్రావెల్స్ షట్టర్ ఎందుకు తీశారంటూ వారితో వాగ్వాదానికి దిగి దాడి చేశారు.