అందరూ ఓకే అన్నారు: విభజనపై డిగ్గీ, వైయస్సార్ ఇష్యూ.. జగన్పై ఫైర్
విశాఖ: అన్ని పార్టీలు అంగీకరించిన అనంతరమే తాము రాష్ట్ర విభజన చేశామని కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ గురువారం నాడు చెప్పారు. విశాఖలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని నిలబడిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే రాష్ట్ర విభజన చేయలేదని అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలు అంగీకరించాకే విభజన చేశామన్నారు.

పోలవరం కేంద్రం నిధులతో పూర్తి చేయాలని చట్టంలో ఉందని చెప్పారు. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ మాటలు ఎవరూ నమ్మవద్దని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి వైయస్ రాజశేఖర రెడ్డికి సంబంధం లేదని వైసిపి, ఆ పార్టీ నేత జగన్ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్ వైభవం తేవాలన్నారు.
ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు అంటే టిడిపి భయపడుతోందన్నారు. అందుకే జీవీఎంసీ ఎన్నికలను తాత్సారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ వచ్చే వరకు తమ పార్టీ పోరాటం ఆగదని చెప్పారు. ఏపీ ప్రయోజనాలు కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేయదని చెప్పారు.
కాపులను బాబు మోసం చేశారు
ఏపీ సీఎం చంద్రబాబు కాపులను మోసం చేశారని డిగ్గీ మండిపడ్డారు. ఉద్యమం చేసే వారిణి అణిచివేయడం అన్యాయం అన్నారు. సంప్రదాయాలను పాటించకుండా దేవాలయాలను కూల్చివేస్తున్నారని ధ్వజమెత్తారు. నిబంధనలు పాటించకుండా రాజధాని కోసం రైతుల నుంచి భూములు లాక్కున్నారని మండిపడ్డారు. విశాఖ ఏజెన్సీలో రాహుల్ గాంధీ వచ్చే నెల 6న పర్యటిస్తారన్నారు. బాక్సైట్ తవ్వకాలకు కమిటీ అనుమతివ్వలేదన్నారు.
కాగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు. విభజన కోపం కారణంగా ఏపీ ప్రజలు ఆ పార్టీని పూర్తిగా దూరం పెట్టారు. ఇప్పుడు ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే విభజనకు అన్ని పార్టీలు అంగీకరించాకే చేశామని, విభజన చట్టంలో తాము ఏపీకి ఎన్నో ఇచ్చామని మళ్లీ మళ్లీ చెప్పే ప్రయత్నాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications