సోనియా, చంద్రబాబు కుట్రలపై ఆర్జీవీ మార్క్ మూవీ..!!
అమరావతి: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను తీయబోయే తరువాతి సినిమాపై కసరత్తు చేస్తోన్నారు. పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ఇది. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం అనంతరం చోటు చేసుకున్న పరిణామాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు రామ్ గోపాల్ వర్మ. దీనికి- వ్యూహం అనే టైటిల్ కూడా ఖరారైన విషయం తెలిసిందే.
ఎల్లుండే కేసీఆర్ ఖమ్మం సభ: ఒక్క మాటలో చెప్పాలంటే..?!
కోనసీమలో..
ఈ సినిమాపై తాజా అప్ డేట్ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఇంకొద్దిరోజుల్లో షూటింగ్ ప్రారంభిస్తానని పేర్కొన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రస్తుతం ఆయన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తోన్నారు. తన స్నేహితులను కలుసుకుంటోన్నారు. వారితో కలిసి కోడి పందాలను తిలకిస్తోన్నారు. ఇదివరకే కాకినాడకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లారాయన.
బయోపిక్ కాదు గానీ..
తాజాగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అందరూ ఊహిస్తోన్నట్లుగా తాను తీయబోయే తరువాతి సినిమా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ కాదని, ఈ విషయాన్ని ఇదివరకే స్పష్టం చేశానని వివరించారు. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల, అప్పటి స్థితిగతులు, వాతావరణంపైనే ఈ తాజా సినిమా ఉంటుందని పేర్కొన్నారు. సినిమా మొత్తం ఒక పొలిటికల్ థ్రిల్లర్ గా ఉంటుందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నామని అన్నారు.
పవన్ అభిమానిని..
తాను పవన్ కల్యాణ్, ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తోన్న జనసేన పార్టీకి అభిమానినని రామ్ గోపాల్ వర్మ పునరుద్ఘాటించారు. పవన్ కల్యాణ్ పై గానీ, జనసేనపై గానీ తాను ఏవైనా ట్వీట్లను పోస్ట్ చేసినా, కామెంట్స్ చేసినా అవి అభిమానంతోనేనని వివరణ ఇచ్చారు. తాను చేసిన ట్వీట్లను పొరపాటుగా అర్థం చేసుకుంటే అది ఆయన ఖర్మ అని వ్యాఖ్యానించారు. పవన్ ను ఎప్పుడూ కించపరిచేలా కామెంట్స్ చేయలేదని అన్నారు.
బుర్ర ఉంటేనే..
తాను చేసిన ట్వీట్లు బుద్ధి, బుర్ర ఉంటేనే అర్థమౌతుందని, అవి లేని వాళ్లు రకరకాలుగా, తమకు నచ్చినట్లుగా అన్వయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అందుకే తాను వీడియో ద్వారా ఈ విషయాన్ని వివరించే ప్రయత్నం చేశానని, అది కూడా వారికి అర్థమౌతుందని తాను అనుకోవట్లేదని రామ్ గోపాల్ వర్మ చురకలు అంటించారు. తనకు నచ్చిన లాంగ్వేజ్ లో తాను ట్వీట్లు చేస్తుంటానని, అది అర్థం చేసుకోకపోవడం వారి తప్పేనని పేర్కొన్నారు.
కోడి పందాలపైనా..
కోడిపందాలపైన కూడా ఓ సినిమా తీస్తానని రామ్ గోపాల్ వర్మ అన్నారు. కోడిపందాలకు ముందు, ఆ తరువాత సంభవించే పరిణామాలపై రియలిస్టిక్ సినిమాను తీస్తానని వ్యాఖ్యానించారు. తన పర్యటన సందర్భంగా ఈ విషయంపైన కూడా చాలామందిని కలిసి వివరాలను సేకరిస్తోన్నానని ఆర్జీవీ స్పష్టంచేశారు.