వైసీపీలో ఎమ్మెల్సీల చిచ్చు- నేతల్లో అసంతృప్తి- గవర్నర్కు పరోక్షంగా ఫిర్యాదులు?
ఏపీలో అధికార వైసీపీలో తాజాగా చేపట్టిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వ్యవహారం చిచ్చు రేపిందా ? నేతల్లో అసంతృప్తి గవర్నర్కు ఫిర్యాదుల రూపంలో బయటపడిందా ? ఈసారి ఎమ్మెల్సీ అభ్యర్ధిత్వం దక్కని వారు పరోక్షంగా గవర్నర్కు ఫిర్యాదు చేశారా ? అందుకే గవర్నర్ ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్ధులపై కేసుల విషయంలో అభ్యంతరాలు లేవనెత్తారా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అంతిమంగా సీఎం జగన్ గవర్నర్ హరిచందన్ వద్దకు వెళ్లి వీటిపైనా లాబీయింగ్ చేసుకోవాల్సిన పరిస్దితిని స్వయంగా వైసీపీ నేతలే కల్పించారా అన్న చర్చ సాగుతోంది.
వైసీపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల చిచ్చు
ఏపీలో తాజాగా ప్రభుత్వం చేపట్టిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారం వైసీపీలో చిచ్చు రేపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో ఎమ్మెల్సీ హామీలు పొంది ఈసారి కోటాలో దక్కించుకోలేని వారు, కొత్తగా పదవులు ఆశిస్తున్న వారు ఇలా చాలామంది నేతలు ఈసారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపికపై అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇందులో కొందరు తమ అసంతృప్తిని వెళ్లగక్కేందుకు పలు మార్గాల్లో ఎదురుచూశారు. చివరికి అనుకున్నదే తడవుగా తమ ప్లాన్ను అమల్లో పెట్టినట్లు తెలుస్తోంది. జగన్ ఢిల్లీ పర్యటన హడావుడిలో ఉన్న సమయంలోనే కొందరు వైసీపీ ముఖ్యులు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ జాబితాపై అసంతృప్తితో చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
గవర్నర్కు అసంతృప్తుల ఫిర్యాదులు?
గవర్నర్ కోటాలో జరిగిన ఎమ్మెల్సీల ఎంపికలపై పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తం కావడంతో వారు బాహాటంగా గళం విప్పేందుకు సాహసించలేదు. అయితే పరోక్షంగా మాత్రం ఈ ఎంపికలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, గుంటూరుకు చెందిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి అభ్యర్థిత్వాలపై వైసీపీ వర్గాల నుండే గవర్నర్ కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో గవర్నర్ ఎమ్మెల్సీలు జాబితాను పెండింగులో పెట్టారని సమాచారం.
జగన్కు తప్పని లాబీయింగ్
వైసీపీ నేతల నుంచి అందిన ఫిర్యాదులతో గవర్నర్ తనకు అందిన ఎమ్మెల్సీ అభ్యర్ధులపై దృష్టిసారించారు. అభ్యర్ధులపై అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. ఫిర్యాదులు నిజమేనని తేలడంతో ఎమ్మెల్సీల ఎంపిక వ్యవహారాన్ని పెండింగ్లో ఉంచారు. ఈ మేరకు ప్రభుత్వానికి కూడా సమాచారం ఇవ్వడంతో చివరికి సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. ఇవాళ సాయంత్రం గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఆయనకు పరిస్ధితి వివరించేందుకు సిద్ధమవుతున్నారు.
వైసీపీలో అసమ్మతి రాజకీయాలపై చర్చ
వైసీపీ అధికారంలోకి వచ్చి తాజాగా రెండేళ్లు పూర్తయ్యాయి. ఇప్పటివరకూ పార్టీలో ఎక్కడా అసంతృప్త స్వరాలు వినిపించలేదు. పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం, తర్వాత జరిగిన స్ధానిక ఎన్నికల్లోనూ భారీ విజయాలు నమోదు చేసుకోవడంతో అధిష్టానంపై కానీ, పార్టీ నిర్ణయాలపై కానీ నేతలు బహిరంగంగా అసంతృప్తి వినిపించేందుకు అవకాశం దక్కలేదు. కానీ నామినేటెడ్ పదవులు ఆలస్యం కావడం, తమ ప్రత్యర్ధులు ఎమ్మెల్సీలు కావడం జీర్ణించుకోలేని నేతలే అసమ్మతి రాజకీయాలకు తెరదీశారని తెలుస్తోంది.