ఏపీలో కరోనాతో చనిపోతే: మృతదేహాలకు కొత్త గైడ్ లైన్స్: ఏం చేయాలి..ఏం చేయకూడదు..!
అమరావతి: కరోనా విలయతాండవం చేస్తోంది. చిన్న పెద్దా అని తేడా లేకుండా కాస్త అజాగ్రత్తగా ఉంటే చాలు అందరికీ సోకీ ప్రాణాల మీదకు తెస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి దారుణంగా తయారైంది. ఆంధ్రప్రదేశ్లో కేసులు స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ మరణాల సంఖ్య మాత్రం పెరుగుతోంది. అయితే కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు చేసేందుకు చాలా మంది జంకుతున్నారు. ఈ క్రమంలోనే పలు సేవా సంస్థలు మానవత్వంను ప్రదర్శిస్తూ చనిపోయినవారి అంత్యక్రియలు చేసేందుకు ముందుకొస్తున్నాయి. కోవిడ్తో మరణించిన వారి అంత్యక్రియల నిర్వహణపై తాజాగా ఏపీ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
మార్గదర్శకాలు
కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. వ్యాధి వ్యాప్తి చెందకుండా అంత్యక్రియల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఏమి చేయకూడదనే అంశాలను ప్రస్తావిస్తూ గైడ్లైన్స్ విడుదల చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం అనుమానం వచ్చిన మృతదేహాలన్నిటికీ కోవిడ్ టెస్టు చేయడం జరుగుతుంది. మృతదేహానికి చేసిన కోవిడ్ టెస్టు నెగిటివ్ రిపోర్టు వచ్చే వరకు కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించకూడదని సూచించింది. కోవిడ్తో చనిపోయిన వారి పూర్తి వివరాలు నోడల్ లేదా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఏర్పాటు చేసిన స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావాలి. అంతేకాదు జిల్లా కలెక్టర్కు కూడా సమాచారం ఇవ్వాలని పేర్కొంది.
మృతదేహాలను ఎలా హ్యాండిల్ చేయాలి
ఒక వ్యక్తి కోవిడ్తో వార్డులో మరణించినట్లయితే హెల్త్ వర్కర్ అక్కడి నుంచి మృతదేహం జాగ్రత్తగా బయటకు తీసుకురావాలి. అంతకుముందు పీపీఈ కిట్ ధరించాలి. మృతదేహం నోరు, నాసిక రంధ్రాలను మూసివేసేలా చర్యలు తీసుకోవాలి. లీక్-ప్రూఫ్ ప్లాస్టిక్ బాడీ బ్యాగ్లో మృతదేహాన్ని ఉంచాలి. ఆ తర్వాత మృతుడు లేదా మృతురాలుకు సంబంధించిన బంధువులు ఇచ్చే పాత బట్టలతో మృతదేహాన్ని గట్టిగా చుట్టేయాలి. మృతదేహాంకు ఎంబామ్ చేయరాదు.
Recommended Video
మృతదేహాలను ఎలా డిస్పోజ్ చేయాలి
పాతబట్టలతో చుట్టబడి ఆపై ప్లాస్టిక్బ్యాగులో ఉంచాకే మృతదేహాన్ని కుటుంబసభ్యులకు ఇవ్వాలి. ఇక మృతదేహాన్ని స్మశానవాటికకు తరలించాక తరలించిన వాహన సిబ్బంది, వాహనంను 1శాతం సోడియం హైపోక్లోరైట్తో డిస్ఇన్ఫెక్ట్ (క్రిమిసంహారం)చేయాలి. మృతదేహంకు స్నానం చేయించడం, ముద్దు పెట్టుకోవడం, కౌగలించుకోవడం వంటివి చేయరాదు. స్మశానవాటికలో 20 మంది కంటే ఎక్కువగా ఉండరాదు. భౌతిక దూరం పాటించాలి. వీలైతే కరెంటు వసతి ఉన్న స్మశాన వాటికలో విద్యుత్ ప్రక్రియ ద్వారా మృతదేహాన్ని కాలిస్తే బాగుంటుందని ప్రభుత్వం పేర్కొంది. బూడిద కుటుంబ సభ్యులకు అందజేయాలి.
ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లకు దీనిపై మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. కోవిడ్ ద్వారా సంభవించిన మరణాలపై సమాచారం తెప్పించుకుని మున్సిపల్ అధికారులకు సరైన గైడెన్స్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. తద్వారా వ్యాధి వ్యాపించకుండా జాగ్రత్త పడాలని పేర్కొంది. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు సీడీఎంఏ సరైన సూచనలు చేయాలని పేర్కొంది. ఇక నుంచి సీడీఎంఏ కూడా స్టేట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంట్తో భాగస్వామ్యం అవుతుందని ఆదేశాల్లో పేర్కొంది.