R.K.Roja: తొలి సంతకమే చిత్తు కాగితం.. ఇది డైవర్షన్ సర్కార్..!
విజయవాడ: ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం, ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. టీడీపీ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు.
హామీలన్నీ బూటకం.. తొలి సంతకమే చిత్తు కాగితం
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారడీ మాటలు చెప్పి,లేనిపోని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టారని మాజీ మంత్రి రోజా అన్నారు.తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని దుస్థితిలో ఉన్నారని ఆమె ఫైర్ అయ్యారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులను నట్టేట ముంచారని చెప్పిన ఆమె... ఆయన పెట్టిన మొదటి సంతకం ఓ చిత్తు కాగితంతో సమానమన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వారు గ్రామాల్లోకి వెళ్లే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. అందుకే డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారని రోజా ఎద్దేవా చేశారు.

డైవర్షన్ పాలిటిక్స్.. డర్టీ కేసులు
ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ ప్రభుత్వం 'డర్టీ డైవర్షన్ పాలిటిక్స్' ఆడుతోందని రోజా ఆరోపించారు. "పీఎస్ఆర్ ఆంజనేయులు లాంటి నిజాయితీపరులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇలాంటి అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ నేతలు ఎవరూ భయపడరని చెప్పిన రోజా... కొందరు పోలీసులు అత్యుత్సాహంతో తప్పులు చేస్తున్నారని వార్నింగ్ ఇచ్చారు. వారందరినీ భవిష్యత్తులో వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చట్టప్రకారం శిక్షించి తీరుతామని హెచ్చరించారు.
అమరావతిలో భారీ దోపిడీకి ప్లాన్
చంద్రబాబుకు నిజంగా దమ్ముంటే ఫైబర్ నెట్,స్కిల్ స్కామ్లపై విచారణ జరిపించాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు.స్కిల్ స్కామ్లో అక్రమాలు చేసి గతంలో అరెస్ట్ అయిన చరిత్ర ఆయనదని గుర్తు చేశారు.ఆ కేసును ఇప్పుడు ఎందుకు తొక్కిపెడుతున్నారని ప్రశ్నించారు.తనపై ఉన్న కేసులపై సీబీఐ విచారణకు సిద్ధమా అని రోజా సవాల్ విసిరారు.అమరావతి పేరుతో మరో భారీ దోపిడీకి తెరలేపుతున్నారని రోజా ఆరోపించారు.గతంలో రూ.36 వేల కోట్లుగా ఉన్న టెండర్ల అంచనాలను ఇప్పుడు రూ.77 వేల కోట్లకు ఎలా పెంచారని నిలదీశారు.ఇది ప్రజాధనాన్ని దోచుకోవడం కాదా? అమరావతిలో చంద్రబాబు మనుషులు, ఆయన సామాజిక వర్గం తప్ప ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండకూడదా? ఈ అంచనాల పెంపుపై ప్రధాని మోదీ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.రాష్ట్రాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నాడని గతంలో మోదీనే అన్న మాటలు గుర్తుచేశారు.
ల్యాండ్, లిక్కర్, మైనింగ్ మాఫియా.. పవన్ కళ్యాణ్ మౌనం ఎందుకు?
టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ల్యాండ్, లిక్కర్, మైనింగ్ మాఫియా రెచ్చిపోతోందని రోజా ఆరోపించారు.చంద్రబాబు తెచ్చిన నూతన మద్యం పాలసీ వల్లే మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్నారు. మాజీ సీఎం జగన్ 43 వేల బెల్టు షాపులు తీసేస్తే, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మళ్లీ వాటిని పెంచుతోందన్నారు.దీనికి మిథున్ రెడ్డికి ఏం సంబంధమని ప్రశ్నించిన ఆమె,ఆయనపై బురద జల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు.
శ్రీవారి లడ్డూపై విష రాజకీయం చేశారని, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు.టీటీడీ గోశాలలో వందల ఆవులు చనిపోతే కనీసం ఒప్పుకునే పాపాన పోలేదని రోజా అన్నారు. తిరుమలలో హత్యలు జరిగే పరిస్థితి వచ్చిందన్నారు.శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించిన రోజా.. పిఠాపురంలో మహిళపై అత్యాచారం జరిగినా, దళితులను వెలేసినా ఆయనకు పట్టదా అని నిలదీశారు. చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే పవన్ బయటకు వస్తారని ఎద్దేవ చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్, బీజేపీ నేతలు ఈ ఘటనలపై ఎందుకు నోరు మెదపడం లేదని అని రోజా ప్రశ్నించారు.
చంద్రబాబు విజన్ కాదు..విస్తరాకుల కట్ట
చంద్రబాబుది విజన్ కాదు, అదో విస్తరాకుల కట్ట అని సెటైర్ వేశారు రోజా. ఆయనపై ఉన్న కేసులన్నీ విచారిస్తే అసలు విజనరీ ఎవరో, నేరస్తుడెవరో తేలుతుందన్నారు.కుప్పంలో ఇల్లు కట్టుకోకుండా అమరావతిలోనే ఎందుకు కట్టుకున్నారో చెప్పాలని రోజా అడిగారు.వారాంతాల్లో చంద్రబాబు, పవన్ హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు? అడ్రస్ లేని ఉర్సా కంపెనీకి 60 ఎకరాల భూమి ఎలా కట్టబెట్టారు? దావోస్ వెళ్లినా ఒక్క కంపెనీ రాలేదు కానీ, ఇలాంటి దొంగ కంపెనీలకు మాత్రం భూములా? ఈ కేటాయింపును వెంటనే ఆపాలని రోజా డిమాండ్ చేశారు.ప్రజలు చంద్రబాబు పాలన చూసి నవ్వుకుంటున్నారని చెప్పిన రోజా...రాజకీయాల కోసం దేవుళ్లను వాడుకుంటే కష్టాలు తప్పవనే విషయాన్ని చంద్రబాబు,పవన్ గ్రహించాలని రోజా హితవు పలికారు.












Click it and Unblock the Notifications