దివ్యకు ప్రాణాపాయం తప్పింది, వీపు భాగంలో కత్తిపోట్లు
హైదరాబాద్: నగరంలోని ఐటీ కారిడార్లో దివ్య అనే యువతి పైన ప్రేమోన్మాది దినేష్ గురువారం రాత్రి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. దివ్య కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వీపు భాగంలో తొమ్మిది కత్తిపోట్లను డాక్టర్లు గుర్తించారు.
ప్రస్తుతం దివ్య ఐసీయులో ఉన్నారు. వీపు భాగంలో 9 కత్తిపోట్లు దిగడంతో రక్తం బాగా పోయింది. దీంతో ఆమె హిమోగ్లోబిన్ పడిపోయింది. ఆమె గొంతు కూడా గాయమైంది. శుక్రవారం మధ్యాహ్నం సమయానికి కొంత మాట్లాడుతున్నారు. ఘటన గురించి చెప్పలేని స్థితిలో ఉన్నారు.
అంతకుముందు వైద్యులు మాట్లాడుతూ.. ఉన్మాది దాడిలో గాయపడిన దివ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. శుక్రవారం ఉదయం దివ్య ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులిటెన్ను విడుదల చేశారు. దివ్య శరీరంపై ఎనిమిది చోట్ల కత్తిపోట్లు ఉన్నాయని, ఏడు గంటల పాటు శ్రమించి సర్జరీ పూర్తి చేశామని వారు తెలిపారు.
మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే బాధిత యువతి ఉంటుందన్నారు. దివ్యకు ప్రాణాపాయం తప్పినట్లే అని వైద్యులు చెప్పారు. తనను ప్రేమించలేదనే ఆగ్రహంతో దినేష్ ఆమె పైన కత్తితో దాడి చేసిన అనంతరం అతనే, స్వయంగా దివ్యను ఆస్పత్రికి తరలించాడు. నిందితుడు దినేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.