"ప్రతీ ఇంట్లో ఒక పారిశ్రామిక వేత్త ఉండాలి..ఏపీ ఇక ఏఐగా మారాలి"
దీపావళి సందర్భంగా విజయవాడ పున్నమీ ఘాట్ లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. సీఎం దంపతులకు మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని చిన్నితో పాటు పలువురు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలో నెంబర్ వన్ గా మారుతుందని.. అందులో స్వర్ణాంధ్ర కూడా అగ్రస్థానంలో ఉంటుందని తెలిపారు.
"జీఎస్టీ సంస్కరణ ఉత్సవాలు దసరా నుంచి ప్రారంభించి దీపావళి వరకూ నిర్వహిస్తున్నాం. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు అందుతున్న ప్రయోజనాల గురించి విజయవాడలో కొందరు వీధి వ్యాపారులు, దుకాణాలను సందర్శించి వారితో మాట్లాడి తెలుసుకున్నాను. ఓటు అనే ఆయుధంతో చీకటి పాలనను ప్రజలు తరిమేశారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న రాక్షసుడిని ప్రజలు ఓడించారు. టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమిని 94 శాతం స్ట్రైక్ రేట్ తో ప్రజలు గెలిపించారు. రాష్ట్రంలో మళ్లీ వైకుంఠపాళి వద్దు" అని సీఎం చంద్రబాబు అన్నారు.

"వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ప్రాణం పోసింది. 16 నెలల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టాం. సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఉద్యోగులకు కూడా ఆర్థిక ప్రయోజనాలు కల్పించాం. ఒక డీఏ ఉద్యోగులకు, పోలీసులకు ఒక సరెండర్ లీవ్ ను మంజూరు చేశాం. త్వరలోనే ఈహెచ్ ఎస్ ను కూడా గాడిలో పెడతాం. ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్నాం. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు, వ్యాపారులకు, పరిశ్రమలకు ప్రయోజనాలు కలుగుతున్నాయి. జీఎస్టీ తగ్గింపుతో ప్రతీ కుటుంబానికి రూ.15 వేలు ఆదా అవుతోంది. అమరావతి నిర్మాణం కూడా వేగంగా చేపడుతున్నాం" అని సీఎం చంద్రబాబు తెలిపారు.

"ప్రతీ ఇంటిలో ఒక పారిశ్రామిక వేత్త ఉండాలి. ఏపీ ఇక ఏఐగా మారాలి. విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ వల్ల ఇతర దేశాలకు సేవలు అందుతాయి. 2027 డిసెంబర్ కు పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. పీ4 అనుసంధానం ద్వారా పేదలకు చేయూత ఇచ్చి జీవన ప్రమాణాలను పెంచుతాం. 2047 నాటికి భారత్ ప్రపంచంలో నెంబర్ వన్ గా మారుతుంది. అందులో స్వర్ణాంధ్ర కూడా అగ్రస్థానంలో ఉంటుంది. తద్వారా ప్రజల ఆర్థిక పరిస్థితి కూడా గణనీయంగా పెరుగుతుంది. ఏపీకి కావాల్సింది సుస్థిరమైన పాలనే. రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నా" అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications