TDP కడప MP అభ్యర్థి ఖరారు?
సీనియర్ రాజకీయవేత్తగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా... ఇలా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న డీఎల్ రవీంద్రారెడ్డి ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇటీవలే ఆయన మీడియా సమావేశం ఏర్పాటుచేసి ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడంతోపాటు తాను ఇప్పటికీ వైసీపీలోనే కొనసాగుతున్నానని స్పష్టత ఇచ్చారు. అయితే ఆయన వ్యాఖ్యల సారాంశాన్ని చూస్తే పార్టీని వీడటం ఖాయమని, తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన డీఎల్
ఉమ్మడి రాష్ట్రం విభజనకు గురికావడంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అథ:పాతాళానికి పడిపోయింది. పార్టీలో ఉన్న దిగ్గజ నేతలంతా కొందరు టీడీపీ, మరికొందరు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొందరు మాత్రం కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లారు. 2019 ఎన్నికల సమయానికి కడప జిల్లావ్యాప్తంగా, మైదుకూరులో వైసీపీ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. అయితే పార్టీ తనను అనుకున్నరీతిలో ఆదరించలేదని భావిస్తున్న డీఎల్ తాజాగా సీఎంపై మండిపడ్డారు.
రెండు పార్టీల తరఫున ఎమ్మెల్యే సీటు కష్టం
రానున్న ఎన్నికల్లో కూడా మైదుకూరు నుంచి తనకు వైసీపీ తరఫున సీటు రాదనే స్పష్టతకు వచ్చారు. అలాగే టీడీపీ తరఫున కూడా సీటు దక్కే అవకాశం ఉండదని భావిస్తున్నారు. పుట్టా సుధాకర్ యాదవ్ ఇన్ ఛార్జిగా ఉన్నారు. బీసీని కాదని రెడ్డి వర్గానికి టికెట్ ఇచ్చే సాహసం చంద్రబాబు చేసే అవకాశం లేదు. మీడియా సమావేశంలో కూడా ఒక ప్రముఖ పార్టీ నుంచి పోటీచేయబోతున్నట్లు డీఎల్ ప్రకటించారు. అయితే డీఎల్ రవీంద్రారెడ్డి సీనియారిటీని ఉపయోగించుకునే ఉద్దేశంలో ఉన్న చంద్రబాబు కడప ఎంపీ స్థానం నుంచి పోటీచేయమని సూచించారు.
ఎమ్మెల్యేగా గెలిస్తే బాగుంటుందని..
వాస్తవానికి ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అటు వైసీపీలోను, ఇటు టీడీపీలోను ఎమ్మెల్యేగా పోటీచేయడానికి అవకాశం లేదు. ఎటువంటి ఆప్షన్లు లేకపోవడంతో ఎంపీగా పోటీచేయడానికి అయిష్టంగానే అయినా అంగీకరించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2011లో కడప లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి వైఎస్ జగన్ చేతిలో ఓటమిపాలయ్యారు. అదే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన ఎంవీ మైసూరారెడ్డి సైతం ఓటమిపాలయ్యారు. ఈ ఇద్దరు నేతలు కాలక్రమంలో వైసీపీలో చేరినప్పటికీ అనుకున్నంతస్థాయిలో ప్రాధాన్యత దక్కకపోవడంతో సైలెంటయ్యారు.