పోలీసులూ .. ప్రజలు ఛీ కొట్టి ముఖాన ఉమ్మేసే పరిస్థితి తెచ్చుకోవద్దు: చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
అరాచకాలు చేసి గెలవాలనుకుంటే ఖబడ్దార్ .. జాగ్రత్త అంటూ వైసీపీ అధినేత జగన్ కు, వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేసిన చంద్రబాబు నేడు పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పోలీసు టెర్రరిజం నడుస్తుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు ఛీ కొట్టి ముఖాన ఉమ్మేసే పరిస్థితి తెచ్చుకోవద్దని చంద్రబాబు పోలీసులకు హితవు పలికారు.
రాష్ట్రంలో పోలీస్ టెర్రరిజం కొనసాగుతుంది
ఆంధ్రప్రదేశ్ పోలీసులపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, దాడులు, దౌర్జన్యాలతో అట్టుడుకుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీస్ టెర్రరిజం కొనసాగుతోందని మండిపడిన చంద్రబాబు రాష్ట్రంలో పోలీసులే టెరరైజ్ చేసే పరిస్ధితి ఉంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందన్నారు.
పోలీసులు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు
పోలీసులు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. పోలీసు వ్యవస్థలో మంచి వారు ఉన్నా వారిని పని చెయ్యనివ్వటం లేదని ఆగ్రహం వ్య్వక్తం చేశారు. చాలా మంది అటు వైసీపీ నాయకుల దుర్జన్యాలను, ఇటు పోలీసుల ఒత్తిడిని తట్టుకోలేక సరెండర్ అవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన నల్ల జీవోని అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యంపైనే దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. పోలీసు దాడులు వల్ల తలెత్తిన ఇబ్బందుల తాలుకు వీడియోలను చంద్రబాబు మీడియాకు చూపించారు. ఇదెక్కడి ప్రజా స్వామ్యం అని ప్రశ్నించారు .
రాష్ట్రంలో పరిస్థితులకు డీజీపీ సమాధానం చెప్పాలి
వివేకానంద హత్య వెనుక ఉంది ఇంటి దొంగలే అన్న సంగతి ప్రపంచమంతా తెలుసన్నారు. విశాఖ పర్యటనకు అనుమతి ఇచ్చి 151 నోటీసు ఇచ్చారని మండిపడ్డారు . మాచర్లలో స్కెచ్ వేస్తే ప్రాణాలు పోకుండా బతికి బయటపడింది మా వాళ్ళేనని చంద్రబాబు చెప్పారు .ఇక పోలీసులు తీరు మార్చుకోవాలని, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించటం సరి కాదన్న చంద్రబాబు ప్రజలు ఛీ కొట్టి ముఖాన ఉమ్మేసే పరిస్థితి పోలీసులు తెచ్చుకోవద్దన్నారు. రాష్ట్రంలో పరిస్థితులకు డీజీపీ సమాధానం చెప్పాలి. ఎవరికి రక్షణ ఉందో డీజీపీ చెప్పాలి అని ప్రశ్నించారు . నియంతలను కాపాడటానికి పోలీసులు చేస్తుంది టెర్రరిజం అని మండిపడ్డారు చంద్రబాబు .
పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలు పెట్టాలి
ఇప్పుడే ఇలా ఉంటె పోలింగ్ పరిస్థితి తలుచుకుంటేనే ఆందోళనగా ఉందని అన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే తమ పార్టీకి సంబంధించిన బీ ఫారాలు కూడా మా అడ్వకేట్ ద్వారా పంపుతామన్న చంద్రబాబు వాటిని స్వీకరించాలని కోరారు. ఇక ప్రజల మాన, ప్రాణ పరిరక్షణ కోసం రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం సాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు . ప్రజలు ధైర్యంగా ఓటేసి ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు .