అయ్యో, ఇలా అయిందేమిటి: ఎదురు తిరిగిన చంద్రబాబు వ్యాఖ్యలు
‘మీ పాలన నచ్చలేదు. మీ పథకాలు మేం తీసుకోం’ అంటే బాగుంటుంది’ అని కూడా టీడీపీ అధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
హైదరాబాద్/ అమరావతి: 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' అనే శీర్షికతో ఇటీవల ఒక సినిమా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే 'అధికార పార్టీ నేతల మాటలకు అర్థాలే వేరులే' అని మాట్లాడుకోవాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ సీఎం - టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కర్నూల్ జిల్లా నంద్యాల పర్యటనలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆయన వద్దకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు 'మనం ప్రజాస్వామ్య వ్యవస్థ'లో ఉన్నామా?, 'నియంత్రుత్వంలో ఉన్నామా?' అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నేరుగా ప్రజల గుండెల్ని తాకేలా ఉన్నాయి.
విపక్షాలను, ప్రజలను ఆత్మరక్షణలోకి నెట్టబోయి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆయనకే తగిలాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో జరిగే నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో టీడీపీని గెలిపించుకోవాలని ఆయన పడుతున్న తాపత్రాయం.. అమలు జేస్తున్న వ్యూహం ప్రతికూల ప్రతిఫలం తెచ్చి పెడుతుందన్న అభిప్రాయం వినిపిస్తున్నది.
లంచం ఇచ్చి గెలుపొందిన వారు అవినీతికి పాల్పడతారు
‘నాకు ఓటేయకుంటే నేనెందుకు పని చేయాలని. చేయను. భవిష్యత్లో అలా చెప్పే రోజులొస్తాయి. నేనిచ్చే రూ.1000 పెన్షన్ తీసుకుంటున్నారు. నేను వేసే రోడ్లపై నడుస్తున్నారు. మనం వేసిన విద్యుత్ దీపాలపై ఆధార పడి నడుస్తున్నారు. మనకు ఓటేందుకు వేయరు? అని మీరంతా అడుగాలి. మీ భవిష్యత్ కోసమే నాకు ఓటేయాలి. ఓటు కోసం రూ.1000 ఇవ్వలేనా? రూ.5000 ఇవ్వలేనా? అలా చేయాలంటే మీ దగ్గరే రూ.5 లక్షలు వసూలు చేయాలి.. అందులో సగం నేను తిని మీకు సగం పంపాలి. ఆ దరిద్ర్యపు రాజకీయాలు అవసరమా? అటువంటి రాజకీయాలు చేసేవారు వస్తున్నారు. అలా డబ్బు ఖర్చుచేసి గెలిచిన వారు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి పాల్పడతారు? అటువంటి రాజకీయాలు అవసరమా?' అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంత పాలన ఇలా
‘మీ పాలన నచ్చలేదు. మీ పథకాలు మేం తీసుకోం' అంటే బాగుంటుంది' అని కూడా టీడీపీ అధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలన్నీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించినవేనని అర్థమవుతూనే ఉన్నది. కానీ డబ్బులు లంచం ఇచ్చి ఓటేయించుకునే రాజకీయాలు తాను చేయబోనని సెలవిచ్చారు చంద్రబాబు. అసలు ‘నేనిచ్చిన ఫించన్ ఎందుకు తీసుకుంటున్నారు? నేనేసిన రోడ్లపై ఎందుకు నడుస్తున్నారు?' అని ఆయన ప్రశ్నించడానికి ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థ అమలులో ఉన్నది. గతంలో రాజరికంలో రాజులు జారీ చేసే ఫర్మానాలకు అనుగుణంగా ప్రజలు కప్పం గడుతూ ఉండే వారు.
నంద్యాలలో టీడీపీ గెలుపే లక్ష్యం
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. కానీ దానికి భిన్నంగా ప్రజలనే బెదిరించే రాజకీయాలు చేస్తున్నది అధికార పార్టీ. మళ్లీ అధికారంలోకి రావాలని కలలు కంటున్నది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల స్థానం నుంచి గెలుపొందిన భూమా నాగిరెడ్డి ఇటీవల హఠాన్మరణానికి గురయ్యారు. దాంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరుగనున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియ టీడీపీలో చేరారు. ప్రస్తుతం అఖిలప్రియ మంత్రి కూడా. నంద్యాలలో గెలుపే లక్ష్యంగా టీడీపీ ముందుకు సాగుతున్నది.
టీడీపీ అభ్యర్థిగా బ్రహ్మానందరెడ్డి పేరు ఖరారు
గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన మాజీ మంత్రి శిల్పా మోహనరెడ్డి.. తనకు ఉప ఎన్నికలో టీడీపీ టిక్కెట్ ఇవ్వదని తేలిపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మరోవైపు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యారు. త్వరలో జరిగే ఉప ఎన్నికలో టీడీపీ నుంచి భూమా నాగిరెడ్డి అన్న కొడుకు బ్రహ్మానందరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన చంద్రబాబు.. ఆయన విజయమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
1978 నుంచి ఇలా చంద్రబాబు ఎదుగుదల
అందులో భాగంగానే కర్నూల్ నగరంలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇవ్వడానికి బదులు నంద్యాలలో ఇవ్వడం వెనుక అసలు రహస్యమిదే. ఎన్నికల్లో గెలుపొటములు సహజం కానీ ఏపీ సీఎం చంద్రబాబు వైఖరి ప్రకారం మరో పార్టీ గెలువొద్దని కనిపించడం లేదు. అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు చెల్లించిన పన్నులతోనే పాలన సాగిస్తున్నారు. పారదర్శక పాలన పేరిట తెరవెనుక రాజకీయాలు చేస్తూ అడుగడుగునా సొమ్ము మూటగట్టుకుంటున్నారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా, తర్వాత అంజయ్య కేబినెట్ లో మంత్రిగా చేరిన నారా చంద్రబాబు నాయుడు తండ్రి ఆస్తి కేవలం రెండు ఎకరాలు.. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 1983లో ఎన్టీఆర్ అల్లుడిగా ఆ పార్టీలో చేరిన చంద్రబాబు నాయుడు క్రమంగా పార్టీలో పట్టు సాధించారు.
ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
రెండు దశాబ్దాల క్రితం చంద్రబాబు హెరిటేజ్ పేరిట ప్రారంభించిన డెయిరీ ఉత్పత్తుల సంస్థ .. ఈ నాడు జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థగా నిలిచింది. అవినీతికి పాల్పడటం తనకు తెలియని మాట అని, ప్రజల మేలు కోసమే రాజకీయాలు చేస్తున్నానని సెలవిస్తున్నారు. అదే మాట నిజమైతే వేల కోట్ల విలువ గల ఆస్తులు ఎలా వచ్చాయని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల ఆదాయం నుంచి ప్రజల సంక్షేమానికి పని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న సంగతి విస్మరించి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తానిచ్చిన పెన్షన్ తీసుకుని అని ప్రశ్నించడానికి ఆయన సొంత జేబు నుంచి, ఆస్తుల నుంచేమీ పని చేయడం లేదని అభిప్రాయ పడుతున్నారు.