విషాదం: డాక్టర్ జయచంద్రన్ మృతదేహం లభ్యం
సోమవారం సాయంత్రం గుంటూరు జిల్లా దుగ్గిరాల సమీపంలో కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలో జయచంద్రన్ కారును గుర్తించిన విషయం తెలిసిందే. కాల్వలో గాలింపు చేపట్టగా మంగళవారం ఉదయం కారు లభ్యమైన ప్రదేశానికి రెండు కిలో మీటర్ల దూరంలో జయచంద్రన్ మృతదేహం లభ్యమైంది. జయచంద్రన్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు కాల్వలో బోల్తా పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
జయచంద్రన్ హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్గా పని చేస్తున్నారు. ప్రతివారం ఆయన తెనాలిలో ఉన్న తమ ఇంటికి వచ్చి వెళుతుంటారు. ఎప్పటిలాగే అక్టోబర్ 18వ తేదీన హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఇద్దరు స్నేహితులతో కలిసి వచ్చారు. అక్కడి నుంచి ఆయన ఒక్కరే కారులో తెనాలికి బయలు దేరారు.
మరో గంటలో ఇంటికి చేరుకుంటానని ఫోన్ చేసి చెప్పిన జయచంద్ర ఇంటికి చేరకపోవడంతో ఆయన కుటుంబసభ్యులు ఆందోళనకు గురై మళ్లీ అతనికి ఫోన్ చేశారు. అయితే అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అని రావడం, మరుసటి రోజు రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో తెనాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సెల్ఫోన్ ట్రాకింగ్ కుంచనపల్లి సమీపంలో ఆగిపోవడంతో కాల్వలో పడిఉంటారన్న అనుమానంతో బకింగ్హామ్ కెనాల్లో గాలించారు. దుగ్గిరాల సమీపంలో కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలో జయచంద్రన్ కారు(ఏపి 07 బిఆర్ 9016)ను గుర్తించారు. అందులో అతను లేకపోవడంతో గాలింపు చేపట్టిన పోలీసులు మంగళవారం ఉదయం డాక్టర్ జయచంద్ర మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.