అనుమానాస్పద స్థితిలో వైద్యుడి మరణం
నెల్లూరు: నెల్లూరు ఆసుపత్రి అధినేత, జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ గుడిగంట విజయకుమార్ (జివికె) మరణించాడు. అయితే ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయ. దీంతో నెల్లూరు నగర పోలీసులు కుమార్ కుటుంబ సభ్యులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
సేకరించిన సమాచారం మేరకు డాక్టర్ విజయకుమార్ బుధవారం అర్ధరాత్రి హఠాత్తుగా మరణించారు. అభ్యుదయ భావాలు కల విజయకుమార్ 1983లో సహ విద్యార్ధిని ఉష అనే యువతిని ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి . వీరి పేర్లు కూడా జాతీయ నాయకుల పేర్లు వచ్చే విధంగా అబ్బాయికి పుచ్చలపల్లి సుందరయ్య పేరు వచ్చే విధంగా సుందర్ అని, అమ్మాయికి లెనినా అని పేర్లు పెట్టారు.
అబ్బాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. అమ్మాయి మలేషియాలో వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. సుందర్ ఈ నెల 20న హైదరాబాద్ నుండి నెల్లూరుకు వచ్చాడు. బుధవారం అర్ధరాత్రి హఠాత్తుగా విజయకుమార్ మరణించాడు. ఈయన మరణం సహజ మరణం కాదని ఆయన స్నేహితుడు ఆత్మకూరుకు చెందిన ప్రముఖ లాయర్ వెంకటశేషారెడ్డి గురువారం ఐదో నగర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
విజయకుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి నిజానిజాలు తెలపాలని డిమాండ్ చేశారు. దీంతో శుక్రవారం ఐదోనగర పోలీసుల ఆధ్వర్యంలో విజయకుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. సహజ మరణం కాదని, ఆయనను ఎవరో ఊపిరి ఆడకుండా గొంతు నులిమి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులలో ఒకరిని శుక్రవారం ఐదో నగర పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.