ఏపీ సచివాలయ ఉద్యోగుల కోత ? రేషనలైజేషన్ పై మాజీ సలహాదారు షాకింగ్..!
ఏపీలో ప్రభుత్వం వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన సచివాలయాల్లో ఉద్యోగుల హేతుబద్ధీకరణ ప్రక్రియను జోరుగా కొనసాగిస్తోంది. అయితే ఇది గందరగోళంగా మారిందన్న విమర్శల వినిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగుల సలహాదారుగా పనిచేసిన ఉద్యోగ నేత చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ ఇదే అంశంపై విమర్శలు గుప్పించారు. సచివాలయ ఉద్యోగుల్ని తగ్గించేందుకే ప్రభుత్వం ఇలా హేతుబద్ధీకరణ చర్యలు తీసుకుంటోందన్నారు. ఇప్పటికే వాలంటీర్ల వ్యవస్ధను ఎత్తేసిన ప్రభుత్వం ఇప్పుడు సచివాలయాల వ్యవస్ధనూ నిర్వీర్వం చేస్తోందన్నారు.
సచివాలయాల్లో రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వం చేస్తున్న మార్పులతో ఉద్యోగుల్లో గందరగోళం నెలకొందని, ఇది కచ్చితంగా సచివాలయ ఉద్యోగులను తగ్గించే చర్య అని వైయస్సార్సీపీ పెన్షనర్స్, ఎంప్లాయీస్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు. సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలకు తెర తీసిందన్నారు.

సచివాలయాల్లో 25వేల ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి ఉన్నా, దాన్ని ప్రభుత్వం పూర్తిగా వదిలేసిందని ఆయన ఆరోపించారు. మరో వైపు 1.27 లక్షల ఉద్యోగుల్లో 15 వేల మంది ఎక్కువ అంటూ ప్రచారం చేస్తోందన్నారు. ఏటా 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న కూటమి ప్రభుత్వం, ఉన్న ఉద్యోగాలనే తొలగించి ఉద్యోగుల పొట్ట కొట్టిందన్నారు. పైగా ప్రభుత్వం ఏర్పాటై 11 నెలలు గడిచినా ఎన్నికల్లో చెప్పినట్టు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదన్నారు.
రేషనలైజేషన్ పేరుతో జనాభా ప్రాతిపదికన సచివాలయాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించే ప్రక్రియను ప్రారంభించిందన్నారు. ఈ మేరకు జీవో నెం.1 జారీ చేశారని తెలిపారు. ఉద్యోగులను జనరల్, టెక్నికల్ సిబ్బందిగా విభజించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, జనరల్ విభాగాలకు కేటాయించిన సిబ్బంది విధులకు సంబంధించి జీవో ఎంఎస్ నెం.3 జారీ చేసిన ప్రభుత్వం, టెక్నికల్ విభాగాలకు కేటాయించిన సిబ్బంది విధులకు సంబంధించి త్వరలోనే మరో జీవో విడుదల చేస్తామని ప్రకటించిందన్నారు.

సచివాలయాలతో పాటు, రైతు భరోసా కేంద్రాల్లో కూడా ఉన్న 4 వేల ఖాళీ పోస్టులకు ప్రభుత్వం మంగళం పాడాలని నిర్ణయించిందని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం అవుతున్న యువత ఆశల మీద ప్రభుత్వం నీళ్లు చల్లిందన్నారు. ఇన్నాళ్లు ఒక్కో సచివాలయానికి ఒక్కో వీఆర్వో ఉంటే, ఇకపై కొన్ని చోట్ల రెండేసి సచివాలయాలకు కూడా ఒక్క వీఆర్వోనే పని చేయాల్సి ఉంటుందన్నారు. రేషనలైజేషన్ పేరుతో పంచాయతీ కార్యదర్శుల పోస్టులను కొన్ని చోట్ల ప్రభుత్వం తీసేసిందన్నారు.
ఈ నిర్ణయం పట్ల పంచాయితీలు, పంచాయతీ సెక్రటరీల ప్రాముఖ్యతపై ఉద్యోగులు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కొన్ని పంచాయితీలకు ఒకటికన్నా ఎక్కువ సచివాలయాలు ఉన్నా కూడా ఉద్యోగుల కేటాయింపు సరిగ్గా జరగలేదని ఉద్యోగులు చెబుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. ఒకే ఉద్యోగికి రకరకాల పనులు కేటాయించడం వలన వారిపై పనిభారం పెరగడంతోపాటు వారిలో నైపుణ్యత కొరవడమే ప్రమాదం కూడా లేకపోలేదన్నారు.
ప్రతి పంచాయతీలో కార్యదర్శి ఉండేలా ఒక పంచాయతీకి ఒక కార్యదర్శి ఉండాలని 2024లో ప్రభుత్వం జీవో ఇచ్చిందని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేసి పంచాయతీలకు కార్యదర్శులను నియమిస్తున్నారన్నారు. దీని వల్ల 15 వేల మంది ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. మరోవైపు ఉద్యోగులపై పనిభారం పెరగడంతో పాటు ప్రజలకు అందే సేవల్లో జాప్యం జరిగే ప్రమాదం ఉందన్నారు.
వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచే వాలంటీర్లకు గౌరవ వేతనాలు ఇచ్చారని, దానికి సంబంధించి బడ్జెట్ ఆర్డర్ కూడా ఉందన్నారు. ఆ శాఖ మంత్రిగా ఉన్న పవన్కళ్యాణ్కు కనీసం ఆ మాత్రం తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. జీవోలు చూపించినా తెలియనట్టు మాట్లాడటం చూస్తే 2.60 లక్షల మంది వాలంటీర్లను మోసం చేయడానికి జరుగుతున్న కుట్రని అర్థం అవుతుందన్నారు. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరదల్లో వలంటీర్ల సేవలు వాడుకున్న ప్రభుత్వం, అవసరం తీరాక అసలు ఆ వ్యవస్థే లేదని చెప్పడం నిజంగా సిగ్గు చేటన్నారు.












Click it and Unblock the Notifications