కాపాడుకోలేక: జగన్పై డొక్కా ఫైర్, మా 12మంది రిజైన్ చేయాలి: వైవీ
ఢిల్లీ/గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన టిడిపి నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సోమవారం నాడు దుమ్మెత్తి పోశారు. ఆయన వలసలను ఆపలేక ఎమ్మెల్యేలను విహారయాత్రకు తీసుకెళ్తున్నారని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైసిపి అధినేత జగన్ వ్యక్తిగత విమర్శలు సరికాదన్నారు. జగన్ పైన విశ్వాసం లేకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని ఎద్దేవా చేశారు.
వలసలను ఆపలేక, ఎమ్మెల్యేలు పార్టీ వీడకుండా ఉండేందుకు వారిని విహార యాత్రలకు తీసుకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్కు రాజకీయ పరిపక్వత లేదన్నారు. ఆయన నియంతృత్వ పోకడలతో ప్రజాప్రతినిధులు పార్టీని వీడుతున్నారని చెప్పారు.

12 మంది రాజీనామా చేయాలి లేదా అనర్హత: వైవి సుబ్బారెడ్డి
తమ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని లేదంటే వారి పైన అనర్హత వేటు వేయాలని వైసిపి నేత వైవీ సుబ్బారెడ్డి సోమవారంనాడు డిమాండ్ చేశారు. వైసిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. ప్రజల దృష్టిని తమ వైఫల్యాల నుంచి మరల్చేందుకే ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. తాము ఫిరాయింపుల సవరణ చట్టాన్ని కోరుతామని చెప్పారు. ప్రాంతీయ, జాతీయ పార్టీల నేతలను తాము కలుస్తామని చెప్పారు.
తమ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలన్నారు.రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రిలను కలుస్తామని చెప్పారు. విభజన హామీలను అమలు చేయాలని తాము కేంద్రం పైన ఒత్తిడి తెస్తామని చెప్పారు. తాము రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications