ఈడీ అటాచ్ చేసిన జగన్ ఆస్తులు మాకే! సాక్షి టీవీలా వద్దు: చంద్రబాబు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారి మహానాడు వేదికగా శుక్రవారం సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈడీ అటాచ్ చేసిన అవినీతిపరుల ఆస్తులు రాష్ట్రానికే చెందాలన్నారు.
రాజధాని నిర్మాణం జీవితంలో వచ్చిన మంచి అవకాశమన్నారు. అమరావతిని అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. టీడీపీ ఆలోచన అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పన అన్నారు. అభివృద్ధి కోసం ఏడు గ్రిడ్లు, 5 మిషన్లతో ముందుకెళ్తున్నామని చెప్పారు.
ఈడి అటాచ్ చేసిన అవినీతిపరుల ఆస్తులు రాష్ట్రానికే చెందాలన్నారు. జగన్ ఆస్తుల కేసు అటాచ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారని చెప్పవచ్చు. టీడీపీని రాజకీయంగా దెబ్బతీయాలని చాలామంది చూశారన్నారు. కానీ ఎవరూ ఏం చేయలేకపోయారన్నారు. తెలంగాణకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా కాదని నేను ఆరోజే చెప్పానన్నారు. రెండు ప్రాంతాలు రెండు కళ్లు అన్నారు.
నేను లోపల ఓ రకంగా, బయట ఓ రకంగా మాట్లాడలేదన్నారు. నీతి, నిజాయితిగా రాజకీయాలు చేయాలని, కుట్రలు కుతంత్రాలతో కాదన్నారు. కొన్ని ఛానళ్లు సాక్షి టీవీలా తయారయ్యాయని ధ్వజమెత్తారు. రాజకీయ నాయకులకే కాకుండా టీవీలు, పేపర్లకు విశ్వసనీయత అవసరమన్నారు.
సాక్షి టీవీతో పాటు మరికొన్ని ఛానళ్లు తమ మీద బురద జల్లాలని ప్రయత్నిస్తున్నాయని, అలాంటి వారి విశ్వసనీయతను తామే ప్రశ్నిస్తామన్నారు.
రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్గా తయారు చేస్తామన్నారు. విద్యాకేంద్రంగా తయారు చేస్తామన్నారు. తెలుగు వారు ఎక్కడున్నా వారి కోసం పని చేస్తుందన్నారు. తెలుగువారి కోసమే కాదని భారత్ కోసం తెలుగుదేశం పని చేస్తుందన్నారు.
విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని కేంద్రం చెప్పిందని స్పష్టం చేశారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నామని, వారి కార్యక్రమాలకు మద్దతిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా మెలిగి హామీలన్నింటిని సాధించుకుంటామన్నారు.
ఎంతమంది రెచ్చగొట్టినా రైతులు భూసమీకరణకు సహకరించారన్నారు. టీడీపీ పైన రైతులకు విశ్వాసం ఉందన్నారు. అలాంటి రైతులకు ఎక్కువిచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్న విశ్వసనీయత మాకు ముఖ్యమన్నారు.
దేశంలో వ్యక్తిగత ఆస్తులు మాత్రమే కాకుండా, కుటుంబ ఆస్తులు కూడా ప్రకటిస్తున్న ఏకైక రాజకీయ నాయకుడిని నేనే అన్నారు. రానున్న సెప్టెంబర్ నెలలో మరోసారి ఆస్తులు ప్రకటిస్తానని చెప్పారు. తన పైన కొందరు ఎన్నోసార్లు కోర్టుకు వెళ్లారని వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి అన్నారు. తనకు హైకమాండ్ కార్యకర్తలే అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం తన జీవితంలో వచ్చిన అద్భుత అవకాశమన్నారు. తెలుగుజాతి గర్వించేలా అమరావతిని నిర్మిస్తామన్నారు.
జూన్ 2న నవనిర్మాణ దీక్ష అంటే కొందరు వక్రీకరించి మాట్లాడుతున్నారని, రాజకీయాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు భాగస్వాములు కావాలని, జూన్ 3 నుంచి 7 వరకు నేతలు గ్రామాల్లో పర్యటించాలన్నారు.