మాతోనే టి, సోనియా ఆటలో తెరాస పావు: ఎర్రబెల్లి
కరుడు గట్టిన సమైక్యవాద పార్టీ అయిన టిడిపి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు తమ పార్టీపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. టిఆర్ఎస్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటు కోసం అఖిల పక్షం సమావేశాన్ని ఏర్పాటు చేయాలని టిడిపినే కోరిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు 2008లోనే కేంద్రానికి లేఖ రాశారని అన్నారు.
తెలంగాణ ప్రాంతానికి నీరు అందకుండా చేపట్టిన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టుని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీకి చెందిన ఇరు ప్రాంత నాయకులు కూడా చంద్రబాబుతోపాటు మహారాష్ట్రకు వెళ్లామని తెలిపారు. ఆ ప్రాంత సమస్యకాకపోయినప్పటికీ సీమాంధ్ర నేతలు కూడా అక్కడికి వచ్చారని, పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నారని అన్నారు. బాబ్లీ ప్రాజెక్టుపై ఇంత ఆందోళన జరిగినా టిఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదని ఆరోపించారు.
చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం మూలంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన అన్నారు. విభజనకు చంద్రబాబు వ్యతిరేకం కాదని, సీమాంధ్ర ప్రజల సమస్యలను పరిష్కరించాలని మాత్రమే చంద్రబాబు దీక్ష చేపట్టారని తెలిపారు. సీమాంధ్ర ప్రజలు విభజనకు సహకరించాలని దయాకర్ రావు కోరారు. సమస్యలను ఇరుప్రాంత నేతలు కూర్చుని ిష్కరించుకోవాలని ఆయన అన్నారు.