నాయుడని పెట్టుకోండి: తెరాసకు వెంకయ్య, హైద్రాబాద్పై
హైదరాబాద్: ఆ నాయుడు.. ఈ నాయుడు అనవద్దని, అవసరమైతే మీరు నాయుడు అని పెట్టుకోవచ్చునని తెలంగాణ రాష్ట్ర సమితికి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శనివారం సూచించారు. బిజెపి విజయం విప్లవాత్మకమైనదన్నారు. విజయం బిజెపి పైన మరింత బాధ్యత పెంచిందన్నారు. మన కలల సాకారానికి దేవుడు పంపిన దూత మోడీ అని చెప్పారు. మోడీ అంటే త్రీడీ అన్నారు. త్రీడి అంటే డెవలప్మెంట్, డైనమిక్, డిసిషన్ అన్నారు.
ప్రజల మధ్య చిచ్చుపెట్టే సంస్కృతి బిజెపిది కాదన్నారు. తెలంగాణ ప్రజల సాకారం చేయాలనే తాము ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సహకరించామని చెప్పారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పారు. ఇరు ప్రాంతాలు పరస్పరం సహకారంగా ఉండాలన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కొందరు ప్రయత్నించారని కానీ, తాము అంగీకరించలేదన్నారు. తెలంగాణలోని సీమాంధ్రులు భయపడాల్సిన అవసరం లేదని, వారికి బిజెపి అండగా ఉంటుందన్నారు.
కేంద్రంతో ఘర్షణ వైఖరి రాష్ట్రాలకు సరికాదన్నారు. అభివృద్ధికి విఘాతం కలిగించవద్దునని హితవు పలికారు. ఆ నాయుడు.. ఈ నాయుడు అని రాద్దాంతం చేయవద్దన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు కూర్చొని మాట్లాడుకోవాలని, కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే విభజన జరుగుతోందన్నారు. ఇది తాత్కాలిక విభజనే అన్నారు. రాష్ట్రాల పైన బిజెపి వివక్ష చూపదన్నారు. తాను అమ్మ ప్రేమకు నోచుకేలేదని, తనను అమ్మలా చూసుకుంది... ఆరెస్సెస్, బిజెపియే అన్నారు.
తాను రాజకీయాల్లోకి రాకముందు తన కుటుంబానికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదన్నారు. తన కుటుంబం వెనుక నెహ్రూ, గాంధీలు లేరన్నారు. తన తాతలు, తండ్రులు రాజకీయాల్లో లేరన్నారు. మట్టి పిసుక్కునే రైతు కుటుంబం నుండి బిజెపి జాతీయ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా ఎదిగానని, అందుకు బిజెపియే కారణమన్నారు. తాను బిజెపిలో కార్యకర్తగా పని చేశానని, స్తంబాలు, కర్రలు ఎక్కి జెండాలు కట్టానని, వాజపేయిని గెలిపించాలని మైకులో అనౌన్స్ చేశానని, అదే వాజపేయి పక్కన కూర్చున్నానని చెప్పారు.
ఎవరికైనా కావాల్సింది వారసత్వం కాదని.. జవసత్వమన్నారు. తెలంగాణ, సీమాంధ్రలకు ఎన్నో సవాళ్లు ఉన్నాయన్నారు. విశాఖలో ధన బలం కాకుండా జన బలం గెలిచిందన్నారు. పోలవరం వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని చెప్పారు. అప్పుడే బందులు రాబోయే రోజులకు సంకేతాలని తెరాసను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర మధ్య ఎలాంటి విభేదాల్లేవన్నారు. అభివృద్ధి కోసం అందరం చేతులు కలుపుదామని చెప్పారు. పోలవరం పేరుతో రాద్దాంతం వద్దన్నారు.
ఉద్యోగ సంఘాల నేతలు కూర్చొని మాట్లాడుకోవచ్చునని తెలిపారు. చాయ్ దుకాణం నడిపే వ్యక్తి దేశానికి ప్రధాని అయ్యారన్నారు. రెండు ప్రాంతాల్లో పార్టీని విస్తరించుకుందామని చెప్పారు. చెప్పిన పని చేయడమే బిజెపి పని అన్నారు. ఇరు ప్రాంతాల్లో తెలంగాణకు అనుకూలమని తాము చెప్పామన్నారు.