డబ్బులు తీస్కొకండి, నాకు చెబితే చాలు: హీరో శివాజీ
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకుల నుండి ప్రజలు ఎవరు కూడా డబ్బులు తీసుకోవద్దని, ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాలని చూస్తే తన దృష్టికి తీసుకు రావాలని, తాను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని ప్రముఖ తెలుగు నటుడు శివాజీ ఆదివారం అన్నారు.
ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు ఆశ చూపడమే నేరమనుకుంటే ఆ ఇచ్చేది కూడా దొంగనోట్లు ముద్రించి పంపిణీ చేసేస్తున్నారట మన నాయకులు అని ఆయన ఎద్దేవా చేశారు. హీరో శివాజీ ఇందుకు ఆధారంగా ఒక యువకుడు రాసిన లేఖను చూపారు.
తమ ప్రాంతంలో ఒక నాయకుడు దొంగనోట్లు ముద్రించి ఓటర్లకు పంచాలనుకుంటున్నాడని, తన సోదరుడు గత పదేళ్లుగా ఆ నేత వద్ద పని చేస్తున్నాడని, ఇటీవలే ఆయన ఇంట్లో ఓ గదిలో రూ.500, 1000 నోట్ల కట్టలు చూసి పని మానేశాడని అందులో పేర్కొన్నాడు. తమను ఎవరైనా చంపుతారేమోనని భయంగా ఉందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశాడా యువకుడు.
ఊరు, పేరు, చిరునామా లేకుండా తెల్ల కాగితాల మీద ఈ దొంగనోట్ల బాగోతాన్ని రాసిన ఆ యువకుడు తన ఇంటి వద్దకు వచ్చి, బయట ఉన్న తన కారు అద్దానికి ఈ లేఖ పెట్టి వెళ్లాడని శివాజీ వివరించారు. జనాలను మోసం చేయడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నాయకులు డబ్బు ఇస్తే తీసుకోవద్దని సూచించారు.