వెధవలు అన్న మాటలకు ఆవేదనా - ప్రేమమూర్తి చంద్రబాబు : టీడీపీ అధినేతకు సినీ ప్రముఖలు మద్దతు...!!
ఏపీలో అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు..చంద్రబాబు కన్నీరు పెట్టటం పైన పలువురు రియాక్ట్ అవుతున్నారు. అసెంబ్లీలో జరిగిన వాదోపవాదనల నడుమ వైసీపీ నేతలు తమ సతీమణి గురించి అసభ్యంగా మాట్లాడారంటూ చంద్రబాబు బోరున విలపించారు. ఆయన విలపించిన తీరు పైన రాజకీయంగా కలకలం రేగింది. తాము అసలు కుటుంబ సభ్యుల పేర్లు ప్రస్తావించ లేదని.. ఎవరూ చంద్రబాబు సతీమణి గురించి మాట్లాడలేదని సీఎం జగన్ మొదలు మంత్రులు..వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు.
చంద్రబాబు కన్నీరు పెట్టటంతో...
వారి తీరుకు నిరసనగా చంద్రబాబు తాను తిరిగి సీఎం అయ్యే వరకూ సభకు రానని ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. మీడియా సమావేశంలో చంద్రబాబు బోరున విలపించిన తీరు పైన ఇప్పుడు సినీ ప్రముఖులు సైతం స్పందించారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు దీని పైన స్పందిస్తూ చంద్రబాబు పై వైసీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండించారు. రాజకీయ పరమైన విభేదాలు, విమర్శలు ఎంతయినా చేసుకోవచ్చు, వ్యక్తులను గౌరవించుకోవాలి,అది మన వ్యవస్థ లక్షణం అని పేర్కొన్నారు. వైసీపీ నేతల తీరుపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రమేష్ సీరియస్
భువనేశ్వరీపై అసభ్య పదజాలం వాడిన వారు పుట్టగతులు లేకుండా పోతారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆక్షేపించారు. ఏపీ ప్రజలు వైసీపీ నేతల నీచ ప్రవర్తనను ఇకపై సహించరని సీఎం రమేష్ మండిపడ్డారు. మరోవైపు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మాజీ ఎంపీ కొత్తపల్లి గీత తెలిపారు. అనైతిక, అప్రజాస్వామిక దాడి గర్హనీయమని కొత్తపల్లి గీత అన్నారు. చంద్రబాబు కంటతడి పెట్టడం తనన్నెంతో కలచివేసిందని గీత పేర్కొన్నారు. చంద్రబాబు కుటుంబానికి సినీనిర్మాత అశ్వినీదత్ సంఘీభావం ప్రకటించారు.
అశ్వనీదత్ కీలక వ్యాఖ్యలు
ఏ మాత్రం స్థాయి లేని వెధవలు అన్న మాటలకు ఆవేదన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. పనికి మాలిన వ్యక్తుల స్థాయి ప్రమాణాలకు అతీతమైన ఎత్తులో చంద్రబాబు ఉన్నారని పేర్కొన్నారు. తెలుగువారంతా ఆత్మీయంగా అభిమానించే ప్రేమమూర్తి చంద్రబాబు అని అశ్వనీ దత్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే జనసేన అధినేత..సినీ నటుడు పవన్ కళ్యాణ్ సైతం దీని పైన స్పందించారు. చంద్రబాబు కన్నీరు పెట్టటం బాధాకరమన్నారు. రాజకీయ నేతలు మహిళల గురించి మాట్లాడే సమయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
రాజకీయ చరిత్రలో దుర్దినం గా
ఇక, మెగా బ్రదర్ నాగబాబు శుక్రవారం రాష్ట్ర రాజకీయ చరిత్రలో దుర్దినం గా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేసారు. ఒకరు చేసిన తప్పు అనిపిస్తే ప్రశ్నించు..నిలదీయి..లేదా తప్పు ఉందనిపిస్తే కమిటీ వేసి నిరూపించి శిక్షించండి.. కానీ, ఇలాంటి నీచ సంస్కృతికి దిగజారకండని సూచించారు. ఎంతో ఉన్నతమైనదిగా..ఉత్తమమైనదిగా ప్రాచుర్యం పొందన మన రాష్ట్ర రాజకీయ భవిష్యత్ ను తలచుకొని బాధ పడాలో..భయపడాలో తెలియని సందిగ్ద దుస్థితి ఏర్పడిందన్నారు.
చంద్రబాబు లాంటి నేత కంట కన్నీరా
చంద్రబాబు తమకు ప్రత్యర్ధి అయి ఉండవచ్చు... తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిపక్షం అయి ఉండవచ్చు..కానీ చంద్రబాబు నాయుడు లాంటి ఒక నేత ఇలా కన్నీటి పర్యంతం అవటం తనను కలిచి వేసిందని నాగబాబు వివరించారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయం రోజు రోజుకీ పరాకాష్టలకు నిలయంగా మారుతోందన్నారు. ఒక ముఖ్యమంత్రిని దూషించి.. మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని అసభ్య పదజాలంతో కించపరిచి తమను తాము హీనాతి హీనమైన విలువలు లేని పురుగులుగా నిరూపించుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ ను దూషించిన సమయంలోనూ
ఒకరిని విమర్శించే నైతిక హక్కు తప్ప..వారిని తిట్టి..వారి కుటుంబాలను దూషించే అధికారం ఏ మాత్రం లేదన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ను..తమ కుటుంబ సభ్యులను ఇలాగే అనుచిత పదాలతో విమర్శించినప్పుడు ఎంతో క్షోభకు గురైన వ్యక్తిగా ..ఆ బాధను అనుభవించిన వ్యక్తిగా..చెబుతున్నా..ఇది అనాగరికం.. సాటి మనుషుల పట్ల క్రూరత్వమని నాగబాబు ఆవేదన వ్యక్తం చేసారు. ఏ పార్టీ అయినా సరే.. ఏ నాయకుడు అయినా సరే..వారి పట్ల కనీస గౌరవాన్ని పాటించి, ఇకనైనా మనుషలుగా మారుతారని ఆశిస్తున్నానని నాగబాబు పేర్కొన్నారు.