ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పుడిస్తారో చెప్పండి? : కేంద్రాన్ని నిలదీసిన జైరాం
న్యూఢిల్లీ : గురువారం సాయంత్రం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై రాజ్యసభలో చర్చను ప్రారంభించారు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విభజన సందర్బంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి సంబంధించిన ఆరు హామిలకు ఒప్పుకున్నారని తెలిపారు. ఏపీకి ఐదేళ్ల ప్రత్యేక హోదాను నాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే.. ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలని అప్పట్లో వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు జైరాం రమేశ్.
ఇక పోలవరం ప్రాజెక్టు విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం తరుపున సహాయ సహకరాలు అందించాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నామని, వెనుకబడిన జిల్లాలకు ఇస్తామన్న ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ విషయం బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు జైరాం.
అలాగే పునర్విభజన చట్టంలో పేర్కొన్న మరిన్ని అంశాలను ప్రస్తావించిన జైరాం.. హైకోర్టు విభజన సంగతి ఏమైందని కేంద్రాన్ని నిలదీశారు. అలాగే ఇప్పటివరకు ఆర్థిక సహాయం కింద ఏపికి ఎన్ని నిదులు ఇచ్చారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా విషయమై కేంద్రం స్పష్టమైన హామి ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆయన, ఆర్థిక లోటును చక్కదిద్దడానికి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా విషయమై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ కూడా ఏపీకి మద్దతు పలికారు. ఇచ్చిన హామిలన్నింటిని కేంద్రం నిలబెట్టుకోవాలని సూచించారాయన. ఇక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుఖేందురాయ్ మాట్లాడుతూ.. ఏపీతో పాటు దేశంలో 10 రాష్ట్రాల పరిస్థితి ఆర్థికంగా బాగా లేదన్నారు. బెంగాల్ తో సహా ఆ పది రాష్ట్రాలతో కేంద్రం ఓ సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకోవాలన్నారు.
జేడీయూ ఎంపీ అన్సారీ కూడా ఏపీ ప్రత్యేక హోదా హామిలను నెరవేర్చాలని కేంద్రానికి విన్నవించారు. గతంలో బీజేపీ ఇచ్చిన హామిలను ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిదని సూచించిన ఆయన, అధికారంలోకి వచ్చిన పార్టీలు అంతకుముందు హామిలపై అలసత్వం ప్రదర్శించవద్దన్నారు.