వ్యభిచార గృహానికి వెళ్లిన విటున్ని విచారించడానికి వీల్లేదు: కేసు రద్దు చేసిన ఏపీ హైకోర్టు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వ్యభిచార గృహానికి వెళ్లిన విటుడి(కస్టమర్)పై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో విచారించడానికి వీల్లేదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఓ వ్యక్తిపై దిగువ కోర్టులో పెండింగ్లో ఉన్న కేసును రద్దు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీ రమేశ్ ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
వ్యభిచార గృహానికి వెళ్లిన వ్యక్తిపై కేసు నమోదు
ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీసులు 2020లో నమోదు చేసిన కేసు ఆధారంగా గుంటూరులోని మొదటి తరగతి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు(స్పెషల్ మొబైల్ కోర్టు)లో తనపై పెండింగ్లో ఉన్న కేసును రద్దు చేయాలంటూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. విటుడి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
వ్యభిచార గృహంలోకి వెళ్లి సొమ్ము చెల్లించే విటుడిని విచారిస్తారా?
2020 అక్టోబర్ 10న పోలీసులు పిటిషనర్పై కేసు నమోదు చేశారని, దర్యాప్తు జరిపి, సంబంధిత కోర్టులో అభియోగపత్రం వేశారని తెలిపారు. వ్యభిచారగృహంపై దాడి చేసినప్పుడు అక్కడే పిటిషనర్ ను కస్టమర్గా ఉన్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారని చెప్పారు.
అయితే, వ్యభిచార గృహాన్ని నిర్వహించేవారు, ఇంటిని వ్యభిచారం కోసం ఇచ్చేవారిపై కేసు పెట్టి విచారించవచ్చు గానీ.. సొమ్ము చెల్లించి విటుడిగా వెళ్లిన వ్యక్తిని విచారించడానికి వీల్లేదని చట్ట నిబంధనలు చెబుతున్నాయని తెలిపారు.
వ్యభిచార గృహానికి వెళ్లిన విటుడిని విచారించొద్దంటూ కేసు రద్దు చేసిన కోర్టు
వ్యభిచార గృహానికి వెళ్లిన కస్టమర్పై నమోదైన కేసును ఇదే కోర్టులో గతంలో కొట్టేశారని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. అదనపు పీపీ వాదనలు వినిపిస్తూ.. పిటిషనరు కేవలం కస్టమర్ మాత్రమేనని చెప్పారు. ఈ వ్యవహారంలో హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. వీటన్నంటినీ పరిగణలోకి తీసుకుని తగిన ఉత్తర్వులివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. వ్యభిచార గృహానికి వెళ్లిన విటుడిపై కేసు నమోదు చేసి, విచారించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అంతేగాక, పిటిషనర్పై కేసును రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు.