చంద్రబాబునాయుడిని అంత తక్కువగా అంచనా వేయవద్దు?
ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా నుంచి జనసేన అధినేత పవన్కల్యాణ్ వరకు, చివరకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వరకు అందరూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని తక్కువ అంచనా వేస్తున్నారని, అధికారంలో లేనంత మాత్రాన తెలుగుదేశం పార్టీకానీ, చంద్రబాబునాయుడుకానీ తమ సామర్థ్యాన్ని, తమ దర్పాన్ని కోల్పోలేదని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.
ఈసారి ఎన్నికలకు పొత్తులు తప్పనిసరి!
ఈసారి ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కీలకం. బీజేపీ కలిసి రానప్పటికీ జనసేనతో కలిసి వెళ్లాలనేది పార్టీ యోచనగా ఉంది. అయితే పవన్ మూడు ఆప్షన్లు ఇవ్వడం, ఆ తర్వాత ప్రజలతోనే పొత్తు ఉంటుందని చెప్పడం అయోమయాన్ని సృష్టించింది. టీడీపీ పదికాలాలపాటు అధికారంతో వర్థిల్లాలంటే ఈసారి పొత్తులు తప్పనిసరి అని చంద్రబాబుకు తెలియని విషయమేదీ కాదు. ఓటర్లలో ఎవరెవరి మద్దతు కూడగడితే అధికారం చేజక్కించుకుంటామనే వ్యూహరచనలో బాబు ఉన్నారు.
వచ్చే ప్రజలను బట్టి చంద్రబాబు అంచనా వేయరు
ప్రస్తుతం చంద్రబాబు సభలకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నప్పటికీ వస్తున్న ప్రజలను బట్టి అధికారం చేజిక్కించుకోవచ్చనే ఆలోచన చంద్రబాబు చేయరు. సభలకు వచ్చే ప్రజలంతా ఓట్లు వేయరు. అంతటి అనుభవం ఆయనకు ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోను పొత్తుండాలి.
మరోసారి ఒంటరిగా పోటీచేసి జగన్మోహన్రెడ్డికి అధికారం అప్పజెప్పేంత ఆలోచన చంద్రబాబు చేయడంలేదు. ఆ అవకాశం కూడా ఆయన ఇవ్వరు. జనసేన నుంచి వస్తున్న డిమాండ్ను ప్రస్తుతం బాబు పరిశీలిస్తున్నారు.
Recommended Video
తెరపైకి 50:50 ఫార్ములా?
తన కుమారుణ్ని ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచన కూడా చంద్రబాబుకు ఉంది. ముందుగా లోకేష్ చేత రాష్ట్రమంతటా పాదయాత్ర చేయించి గట్టి నాయకుడిగా తీర్చిదిద్దాలనే యోచనలో ఉన్నారు. అప్పటి వరకు పొత్తులపై స్పందించకుండా వ్యూహాత్మకంగా మౌనం వహించాలని, చివరిలో మాట్లాడి అవకాశం, సందర్భం, అప్పటి పరిస్థితులను అంచనా వేసుకొని 50:50 ఫార్ములాను అమలు చేస్తే మంచిదనే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నారు. మొదటి రెండున్నర సంవత్సరాలు తెలుగుదేశం, తర్వాత రెండున్నర సంవత్సరాలు జనసేన ఉండేలా అయితే బాగుంటుందనే యోచనలో ఉన్నారు.
కాపు, యువత ఓట్లు లభిస్తే చాలు!
తెలుగుదేశం-జనసేన పొత్తుల్లో భాగంగా జనసేనకు 40కి మించి సీట్లిచ్చే అవకాశం కనపడటంలేదు. కాబట్టి సీట్లపరంగా టీడీపీదే పైచేయిగా ఉంటుంది. 50:50 ఫార్ములాను అమలు చేస్తే కాపు సామాజికవర్గం కూడా ముఖ్యమంత్రి పదవిని చేపట్టినట్లవుతుంది. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కాపు వర్గం ఓట్లతోపాటు యువతరం ఓట్లు కూడా కావాలి. అవి రెండూ లభిస్తే సులభంగా విజయం సాధించవచ్చు.