ఏపీలో ఓటర్ల ఇంటింటి సర్వే మొదలు-వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న విపక్షాలు..!
ఏపీలో ఇంటింటి ఓటర్ల సమగ్ర సర్వే మొదలైంది. బూత్ లెవెల్ అధికారులు ఇవాళ్టి నుంచి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను స్వయంగా పరిశీలిస్తారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగేలా చూస్తారు. అలాగే 2024 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండనున్న వారికి ఓటు హక్కు కల్పిస్తారు. ఓటరు జాబితాలో డబుల్ ఎంట్రీలు, నకిలీ ఓట్ల గుర్తింపు చేపడతారు. చనిపోయిన వారి ఓట్లు తొలగిస్తారు. వందేళ్లు వయస్సు పైబడిన వారిని ప్రత్యేకంగా గుర్తిస్తారు. డోర్ నంబర్లు లేని, ఒకే డోర్ నంబరుపై పదుల సంఖ్యలో ఉన్న ఓట్లు పరిశీలిస్తారు.
సర్వీసు ఓటర్లు(మిలటరీ), ఎన్ఆర్ఐ ఓటర్ల వివరాలను బీఎల్వోలు సరిచేస్తారు. దీర్ఘ కాలంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను వారి కోరిక ఏ ప్రాంతంలో ఉంచాలో కనుక్కుని అక్కడి జాబితాలో ఉంచుతారు. ఒక బూత్లో సరాసరి 1,500 ఓట్లకు మించి ఉంటే కొత్త బూత్కు సిఫార్సు చేస్తారు. పేర్లు, నియోజకవర్గాలు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఫొటో గుర్తింపు కార్డులు మార్పులు, చేర్పులు తప్పుఒప్పులు సరిచేస్తారు. ఓటర్ల అభ్యర్థన మేరకు ఒక చోటు నుంచి మరో చోటుకు మారుస్తారు. గుర్తింపు కార్డులు, జాబితాల్లోని తప్పుల సవరిస్తారు.

అలాగే స్పష్టత లేని ఫొటోలు తొలగించి, మంచి ఫోటోలు ఏర్పాటు చేస్తారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారికి పంపిస్తారు.
కొత్తగా ఓటు హక్కు పొందని వారుంటే వారు ఓటు హక్కు పొందే అవకాశం కల్పిస్తారు. నియోజకవర్గం మారినా, ఓటరు జాబితాలో పేర్లు లేకపోయినా, తప్పులున్నా సరిచేసుకునే అవకాశం కల్పిస్తారు. ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు ఇంటింటికీ బూత్ లెవల్ అధికారుల సర్వే కొనసాగనుంది. అక్టోబర్ 17వ తేదీన ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్ ప్రచురిస్తారు. వాటిపై క్లెయిమ్లు, అభ్యంతరాలు నవంబరు 30 వరకు స్వీకరిస్తారు. తుది జాబితాలు 2024 జనవరి 5 ప్రచురిస్తారు.
మరోవైపు ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ప్రతి వారం రాజకీయ పక్షాలకు నియోజకవర్గ స్ధాయిలో సమాచారం అందిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. లోపాలు లేని ఓటర్ల తుది జాబితా కోసం ఈ అవకాశాన్ని రాజకీయ పక్షాలు సద్వినియోగం చేసుకోలన్నారు. గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పక్షాలతో నిన్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ, ఓటరు నమోదు దరఖాస్తుల పరిష్కారం, బిఎల్ఓల పాత్ర, ఈఆర్ఓలు తీసుకోవలసిన చర్యలకు సంబంధించి జారీ చేసిన సూచనల్ని రాజకీయ పార్టీల దృష్టికి తెచ్చారు. ఈఆర్ఓలు ప్రతి వారం క్లెయిమ్లు, అభ్యంతరాల జాబితాను నియోజకవర్గ స్థాయిలో రాజకీయ పార్టీలకు అందిస్తారని, వాటినే సిఇఓ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామన్నారు.
అలాగే బిఎల్ఓలు ఇంటింటి పరిశీలన సమయంలో వాలంటీర్లను దూరం పెట్టాలని కోరగా, ఇందుకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు ఉన్నాయని మీనా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బిఎల్ఓలుగా తాత్కాలిక ఉద్యోగులను నియమించరాదని కోరగా, ఎన్నికల సంఘం నిబంధనావళి మేరకు శాశ్వత ఉద్యోగులనే నియమించామన్నారు. సిపిఎం పార్టీ ఓటర్ల జాబితాకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుగులో అందించాలని కోరారు.












Click it and Unblock the Notifications