బందరులో కరోనా మృతుడి సోదరుడి మృతి- అనుమానాలతో పరీక్షలకు శాంపిల్స్...
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. బాధితుల్లో ఏ ఒక్కరికి చీమ కుట్టినా ఇప్పుడు సర్వత్రా చర్చ జరిగే పరిస్ధితి. ఇలాంటి తరుణంలో కరోనా వైరస్ తో మృతి చెందిన ఓ వ్యక్తి సోదరుడు నిన్న రాత్రి చనిపోవడంతో స్ధానికులంతా ఉలిక్కి పడ్డారు. మృతి వెనుక ఆరోగ్య సమస్యలే కారణమని బంధువులు చెబుతున్నా స్ధానికులు నమ్మలేని పరిస్ధితి. దీంతో అధికారులు రంగంలోకి దిగారు.
బందరులో కరోనా మృతుడి సోదరుడి మృతి...
బందరులో గత వారం కరోనా వైరస్ కారణంగా ఓ వ్యక్తి చనిపోయాడు. నిన్న రాత్రి ఆయనకు స్వయానా సోదరుడు కూడా చనిపోయాడు. ఉదయాన్నే విషయం తెలుసుకున్న స్ధానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మృతికి గల కారణాలు తెలుసుకోకుండానే అనుమానించడం మొదలుపెట్టారు. విషయం అధికారులకు ఫిర్యాదు వరకూ వెళ్లింది. అధికారులు ప్రశ్నించడంతో మృతుడి కుటుంబీకులు రాత్రి గుండెపోటు రావడంతో చనిపోయినట్లు వెల్లడించారు.

మృతదేహం స్వాధీనం- పరీక్షలకు శాంపిల్స్..
స్ధానికుల అందోళన నేపథ్యంలో మృతదేహానికి అంత్యక్రియలు జరపకుండా అడ్డుకున్న అధికారులు... మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంటనే శాంపిల్స్ తీసి కరోనా పరీక్షలకు పంపారు. శాంపిల్స్ ఫలితాలు వచ్చే వరకూ మృతదేహాన్నికుటుంబ సభ్యులకు అప్పగించబోమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఒకవేళ కరోనా వైరస్ సోకి ఉంటే ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్తగా మాత్రమే శాంపిల్స్ ను పరీక్షలకు పంపామని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications