వైసీపీ ఎమ్మెల్సీ కారులో డెడ్ బాడీ-డ్రైవర్ దిగా గుర్తింపు-బాధితుల ఆగ్రహంతో కారు వదిలి పరార్
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు ఓ హత్య వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కారులో ఇవాళ ఓ మృతదేహం లభ్యమైంది. గతంలో ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్ గా పనిచేసిన సుబ్రమణ్యం అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతని మృతదేహం ఎమ్మెల్సీ కారులో లభించడంతో కలకలం రేగింది.
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో మృతదేహం కలకలం రేపుతోంది.ఎమ్మెల్సీ కారులో అనుమానాస్పదంగా యువకుడి మృతదేహం లభించింది. ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న వీధి సుబ్రమణ్యంగా గుర్తించారు. నిన్న రాత్రి తమ కొడుకును ఎమ్మెల్సీ తీసుకెళ్లారని కుటుంబీకులు ఆరోపించారు. అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడంటూ మృతదేహాన్ని ఎమ్మెల్సీ కారులో తీసుకుని వచ్చారు. దీంతో మృతుడి తల్లితండ్రులు ఎమ్మెల్సీని నిలదీశారు. కారులో నుంచి మృతదేహాన్ని కిందికి దించాలని కోరారు. దీంతో ఎమ్మెల్సీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ కారులో డెడ్ బాడీ ఉండటాన్ని గుర్తించిన స్ధానికులు, డ్రైవర్ కుటుంబ సభ్యులు కారును అడ్డుకున్నారు. బాధితుల ఆందోళనతో అనంత ఉదయ్ బాబు ఆ కారు వదిలి మరో కారులో వెళ్లిపోయారు. సుబ్రమణ్యంను హత్య చేశారంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైసీపీ ఎమ్మెల్సీ కారులో మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఐదేళ్లుగా సుబ్రమణ్యం ఎమ్మెల్సీ ఉదయ్ బాబు దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది