శ్రీశైలం మల్లన్నఆలయం వద్ద మరోమారు డ్రోన్ల కలకలం: ఇద్దరు గుజరాతీలు అరెస్ట్; పోలీసుల దర్యాప్తు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో మరోమారు డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. గతంలోనూ ఓ మారు శ్రీశైలంలో డ్రోన్లు సంచరించడం కలకలం రేపగా, పోలీసులు రంగంలోకి దిగి డ్రోన్లను ఎగరవేసిన వారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఇక బీజేపీ నేతలు శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.

ఆలయ పుష్కరిణి వద్ద డ్రోన్ ను గుర్తించిన భక్తులు ... డ్రోన్ ను పట్టుకున్న అధికారులు
తాజాగా మరోమారు ఆలయ పుష్కరిణి వద్ద డ్రోన్స్ ప్రయోగానికి కొందరు ప్రయత్నించడం సంచలనం సృష్టించింది. ఆలయం వద్ద డ్రోన్స్ ఎగరవెయ్యటం నిషేధం అని చెప్తున్నప్పటికీ, ఆలయ పుష్కరిణి వద్ద కొందరు డ్రోన్స్ ఎగరవేసి కలకలం రేపారు. ఆలయ పుష్కరిణి వద్ద భక్తులు స్నానం చేస్తూ పైన డ్రోన్ ఎగురుతున్న దృశ్యాలను చూసి ఆలయ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆలయ భద్రతా సిబ్బంది వారిని అడ్డుకుని డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ వెంట పరుగులు పెట్టి, దానిని కిందికి దించే టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న భద్రతా సిబ్బంది .. గుజరాత్ వారిగా గుర్తింపు
ఇక ఆ ప్రాంతంలోనే రిమోట్ తో డ్రోన్ ను ఆపరేట్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆలయ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. శ్రీశైలం ఆలయం వద్ద డ్రోన్ ఎగర వేస్తూ పట్టుబడిన ఇద్దరు గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారని తెలుస్తుంది. అసలు వారు శ్రీశైలంలో డ్రోన్ ఎందుకు ఎగరవేశారు? ఆలయం దగ్గరకు ఎలా తీసుకువచ్చారు? వారికి సహకరించిన వారు ఎవరు? వారు గుజరాత్ నుండి ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు డ్రోన్ ఎగరవేసిన ఇద్దరు నిందితులను విచారిస్తున్నారు.

డ్రోన్ ను పట్టుకోవటంలో భక్తుల చొరవ... భద్రతా సిబ్బంది తీరుపై అసహనం
అయితే ఈ డ్రోన్ ను పట్టుకున్న వ్యవహారంలో భక్తులు చొరవ చూపించి, డ్రోన్ వీడియో తీసి అధికారులకు సమాచారం అందించే దాకా భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు? అన్నది పెద్ద ప్రశ్న. ఈ పరిణామం శ్రీశైలంలో భద్రతా వైఫల్యాన్ని కళ్ళకు కట్టింది. భక్తులకు ఉన్నపాటి శ్రద్ధ కూడా ఆలయ భద్రతా సిబ్బందికి లేదన్న టాక్ వినిపిస్తుంది. గతంలోనూ శ్రీశైలం ఆలయం పై నాలుగు రోజులపాటు రాత్రి సమయాల్లో డ్రోన్లు సంచరించినప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు, అప్పుడు ఆ వ్యవహారంలో ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకున్న దాఖలాలు లేవు. నిందితులను గుర్తించలేదు. ఇక తాజాగా మరోమారు డ్రోన్ తో వీడియో చిత్రీకరణ చేస్తున్న క్రమంలో ఇద్దరు పట్టుబడడంతో ఈ వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Recommended Video

ఈ ఏడాది మేలో నాలుగు రోజుల పాటు రాత్రి సమయాల్లో డ్రోన్స్ కలకలం
ఈ ఏడాది మే నెలలో నాలుగు రోజులుగా రాత్రి సమయాల్లో శ్రీశైలం శైవక్షేత్రం పై డ్రోన్ కెమెరాలు సంచరించడం అప్పట్లో కలకలం రేపింది. నాలుగు రోజులు శ్రీశైలం ఆలయం చుట్టూ తిరిగిన డ్రోన్లు ఆలయ అధికారులకు ఆందోళన కలిగించాయి. దీనికి సంబంధించి ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ క్రమంలో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రమాదం పొంచి ఉందని శ్రీశైలంను 'నో ఫ్లై' జోన్గా ప్రకటించాలని బిజెపి డిమాండ్ చేసింది. అప్పుడు ఆలయం సమీపంలో ఆకాశంలో సంచరించిన డ్రోన్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్వార్టర్స్, ఔటర్ రింగ్ రోడ్, మల్లమ్మ కన్నీరు, ఉత్తరా పార్క్, విశ్వామిత్ర మఠం, రిజర్వాయర్ మరియు కొన్ని ఇతర సైట్లను చిత్రీకరించినట్లు అనుమానాలు ఉన్నాయి. అప్పట్లో నల్లమల అటవీ ప్రాంతంలో,అటవీ శాఖ అధికారులతో కలిసి పోలీసులు డ్రోన్లని పట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేశారు. కానీ నిందితులను పట్టుకోలేకపోయారు.












Click it and Unblock the Notifications