తాగుబోతు సైక్లిస్ట్ రాంగ్ రూట్: అడ్డొచ్చాడని కొట్టి చంపాడు
విజయవాడ: తాగిన మత్తులో రాంగ్ రూట్లో సైకిల్ నడుపుతూ ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి, పైగా అతనిపై దాడి చేశాడు. ఈ దాడిలో ద్విచక్రవాహనదారుడు సాంబశివరావు ప్రాణాలు గాలిలో కలిశాయి. సైకిల్ టీవిఎస్ వాహనాన్ని ఢీకొనడంతో ఇరువురి మధ్య గొడవ ప్రారంభమైంది.
దాంతో తాగిన మత్తులో ఉన్న సైక్లిస్టుకు తాను ఏం చేస్తున్నాడో కూడా తెలియలేదు. టివిఎస్ నడిపిన వ్యక్తిని తీవ్రంగా కొట్టాడు. దీంతో అతను ఆస్పత్రి పాలయ్యాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరగగా, గాయాల పాలైన సాంబశివ రావు శనివారం మరణించాడు.
కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి పునాదిపాడు సెంటర్లో టీవీఎస్పై వెళ్తున్న పొల్లూరు సాంబశివ రావు (40) అనే వ్యక్తిని సైకిల్పై రాంగ్ రూట్లో వస్తూ తన సైకిల్తో ఢీకొట్టాడు.
దాంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కోపంతో రెచ్చిపోయిన కిరణ్ సాంబశివరావుపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సాంబశివ రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇదంతా సిసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. సిసీటీవి కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.