జానాపై డిఎస్ గుర్రు: టీ కాంగ్రెసు నేతల ఢిల్లీ తొవ్వ
హైదరాబాద్: తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను తప్పిస్తారనే ప్రచారం ఊపందుకోవడంతో ఈ రాష్ట్ర కాంగ్రెసు నాయకులు పలువురు ఢిల్లీ బాట పట్టారు. అదే సమయంలో కాంగ్రెసు శాసనసభా పక్షం (సిఎల్పీ) నేత కె. జానారెడ్డిపై పార్టీ శాసనమండలి పక్ష నేత డి. శ్రీనివాస్ గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు.
సిఎల్పీ కార్యవర్గ ఏర్పాటుపై పార్టీ శాసనమండలి పక్ష నేత డి.శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కార్యవర్గ కూర్పు పూర్తి ఏకపక్షంగా ఉందనే ఆయన అభ్యంతరంగా చెబుతున్నారు. కార్యవర్గ ఎంపిక సందర్భంగా మండలి పక్ష నేతనైన తనను మాట వరుసకైనా సంప్రదించలేదని డిఎస్ గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు.
సీఎల్పీ నేత, శాసన మండలి పక్ష నేత ఇద్దరూ సమావేశమై సీఎల్పీ కార్యవర్గాన్ని ఎంపిక చేయడం పార్టీలో సంప్రదాయంగా వస్తోంది. కానీ ఈసారి మాత్రం శాసన మండలి పక్ష నేతగా తనను సంప్రదించకుండా, సమావేశాన్ని ఏర్పాటు చేయకుండా ఏకపక్షంగా జానారెడ్డి ఎంపిక చేసుకున్నారంటూ డీఎస్ నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఉన్నా, ఒక్కరినీ సీఎల్పీ కార్యవర్గంలోకి తీసుకోకపోవడం పట్ల ఆయన ఆగ్రహిస్తున్నారు.
ఇప్పటికే ఎమ్మెల్సీల్లో కొంత మేర అసంతృప్తి చోటు చేసుకుందని, తొమ్మిది మంది ఎమ్మెల్సీలు పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరారని, ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీలకు స్థానం కల్పించకపోవడంపై పార్టీలో తప్పుడు సంకేతాలు వెళతాయని అంటున్నారు.
సీఎల్పీ కార్యవర్గంలో చోటు దక్కని ఎమ్మెల్యేలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిపై కన్నేశారు. ముఖ్యంగా పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు కిష్టారెడ్డి, రాంరెడ్డి వెంకట్రెడ్డి, రెడ్యా నాయక్లు ఈ పదవిని ఆశిస్తున్నట్లు తెలిసింది.
టీపీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ బుధవారం ఢిల్లీ బాట పట్టారు. ఒకవేళ పొన్నాలను మార్చాల్సి వస్తే, తనకు అవకాశం ఇవ్వాలంటూ పార్టీ పెద్దలను ఆమె కోరనున్నట్లు తెలిసింది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీలో ఏఐసీసీ నేతలు దిగ్విజయ్సింగ్, అహ్మద్ పటేల్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుని మార్పుపై చర్చ జరిగినట్లు తెలిసింది.