ఏపీలో ఓటాన్ అకౌంట్ సమావేశాలు కూడా కష్టమే.. ! ఆర్డినెన్స్ దిశగా ప్రభుత్వం అడుగులు..
ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో అన్ని వ్యవస్ధలూ ఒక్కొక్కటిగా స్తంభిస్తున్నాయి. ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్ధితి. ఇప్పటికే విద్యాసంస్ధలు, గుళ్లు, వాణిజ్య సముదాయాలు, మాల్స్, దుకాణాలు అన్నింటికీ సెలవు ప్రకటించేశారు. విజయవాడ, విశాఖ, ఒంగోలులో అయితే ఏకంగా లాక్ డౌన్ ప్రకటించారు. ఇవన్నీ ఓ ఎత్తయితే ప్రభుత్వ పాలన మరో ఎెత్తు. ఈ నెల 31లోగా ప్రభుత్వం శాసనసభను సమావేశపరిచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఇది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారిస్తోంది.

కరోనా ప్రభావం అసెంబ్లీపైనా...
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో మూడు జిల్లాల్లో అధికారికంగా లాక్ డౌన్ ప్రకటించగా.. మిగతా జిల్లాల్లోనూ అనధికారికంగా సెలవులు ఇచ్చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ ప్రభావంతో ఈ నెల 31లోపు జరగాల్సిన అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ సమావేశాల నిర్వహణ కూడా అగమ్యగోచరంగా మారింది. వాస్తవానికి పూర్తిస్ధాయిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నా.. స్ధానిక ఎన్నికలతో పాటు వివిధ కారణాలతో ఓటాన్ అకౌంట్ కే పరిమితం కావాల్సి వచ్చింది. కానీ కరోనా ప్రభావంతో ఇప్పుడు వాటిని కూడా నిర్వహించలేని పరిస్ధితి.

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టకపోతే...
పూర్తిస్ధాయి బడ్జెట్ పెట్టాల్సిన చోట కనీసం ఓటాన్ అకౌంట్ బడ్టెట్ సమావేశాలు అయినా నిర్వహించి రాబోయే మూడు నెలలకు కావాల్సిన నిధులను తీసుకోవచ్చని భావించిన ప్రభుత్వ ఆశలకు కరోనా వైరస్ గండికొట్టింది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ప్రజలను ఇళ్లనుంచి బయటికి రావొద్దని ప్రభుత్వం పదేపదే కోరుతోంది. అటువంటప్పుడు ఎమ్మెల్యేలు సైతం బయటికి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. అలాంటిది ఏకంగా అసెంబ్లీ సమావేశాలకు రావాలని ప్రభుత్వం కోరే పరిస్ధితి లేదు. అందునా అసెంబ్లీలో అంతా ఒకచోట గుమికూడితే... వారిలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా మిగతా వారికి వ్యాప్తి చెందక తప్పదు. అప్పుడు ఎమ్మెల్యేల భద్రతకూ ఇబ్బందులు తప్పవు. దీంతో ఓవైపు బడ్జెట్ సమావేశాలు పెట్టలేక, కనీసం ఓటాన్ కూడా నిర్వహించలేక ప్రభుత్వం సతమతం కావాల్సిన పరిస్దితి. అయితే మరి నిధులెలా వస్తాయన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.

ఓటాన్ కు ప్రత్యామ్నాయంగా ఆర్ఢినెన్స్..
రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రం లేదా కేంద్రంలోని చట్ట సభలు నిర్వహించలేని పరిస్దితి ఉన్నప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేకపోతే వాటి స్ధానంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి మూడు నెలలకు సరిపడా నిధులను విడుదల చేసుకునే అవకాశముంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి సదరు ఆర్డినెన్స్ లో ఆమోదించిన అంశాలకు ప్రభుత్వ ముద్ర వేసుకోవచ్చు. దీంతో ఇప్పుడు ఆర్డినెన్స్ జారీకి ఉన్న అవకాశాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. న్యాయనిపుణులతో సంప్రదింపుల తర్వాత ఆర్డినెన్స్ జారీపై ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం వెల్లడించే అవకాశముంది.












Click it and Unblock the Notifications