మూగ యువతిపై గ్యాంగ్ రేప్, మహిళా ఉద్యోగినిపై వేధింపులు
ఒంగోలు: మూగ యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని గంగపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పొదిలి సిఐ బి రవిచంద్ర ఆదివారం మీడియా సమావేశంలో తెలిపారు.
మూగ యువతి గంగపాలెం గ్రామంలో ఒంటరిగా నివసిస్తోందన్నారు. ఆమెకు తల్లిదండ్రులు లేరన్నారు. కాగా మూడు రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన నరసింహారెడ్డి, ప్రసాద్రెడ్డి, చిన కాశిరెడ్డి అనే ముగ్గురు యువకులు ఒంటరిగా ఉంటున్న యువతి ఇంట్లోకి చొరబడి ఆమె చేత మద్యం తాగించారన్నారు. అప్పటికే మద్యం తాగి ఉన్న ఆ ముగ్గురు యువకులు ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు.
ఓ ప్రైవేట్ స్కూల్లో పని చేస్తున్న ఒక మహిళా ఉద్యోగిని వేధిస్తున్న పోతంశెట్టి వంశీకృష్ణ అనే నిందితుని ఒంగోలులో ఆదివారం అరెస్టు చేసినట్లు ఒంగోలు పట్టణ డిఎస్పీ జి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. ఈ నెల 5వ తేదీన ప్రైవేట్ స్కూల్లో పని చేస్తున్న ఒక మహిళా ఉద్యోగి వెంటబడి వేధిస్తున్న వంశీకృష్ణ ఆమె నిరాకరించడంతో ఆమె చెంపపై కొట్డాడు. దీంతో ఆమె ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఆదివారం నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పర్చనున్నట్లు డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
రద్దీగా ఉండే ప్రాంతాల్లో, దేవాలయాల్లో, వ్యాపార సముదాయాల వద్ద ఉండే మహిళల పట్ల ఎవరైనా ఈవ్టీజింగ్కు పాల్పడితే అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డిఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. మహిళలకు భద్రత కల్పించే విషయంలో కఠినంగా వ్యవహరించనున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల కాలంలో ఒంగోలులోని పలు ప్రాంతాల్లో ఇళ్లలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. అయితే ఇళ్లలో దొంగతనాల విషయంలో తాము చేతి వేలిముద్రలను పరిశీలిస్తామని తెలిపారు.
అయితే ఇక్కడ పాత దొంగలు వేలి ముద్రలు కావని బయట నుండి వచ్చిన కొత్త వ్యక్తుల వేలి ముద్రలుగా గుర్తించినట్లు తెలిపారు. దీంతో నైట్ బీట్ పోలీస్ పెట్రోలింగ్ను పటిష్టం చేసినట్లు తెలిపారు. ఒంగోలు నగరంలో ఎవరైనా కొత్త వ్యక్తులు స్క్రూడ్రైవర్లు పట్టుకొని లేదా అనుమానిత వ్యక్తులు వివిధరకాల వస్తువులు కలిగి ఉన్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డిఎస్పీ ప్రజలను కోరారు. ప్రజలు కూడా బయటకు వెళ్లేటప్పుడు తమ ఇళ్ల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్లాలని సూచించారు.