కృష్ణానదిలో తెప్పోత్సవానికి బ్రేక్- దుర్గాఘాట్ లోనే పూజలు-కారణమిదే..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి సంబరాలు చివరి దశకు చేరుకుంటున్నాయి. శరన్నవరాత్రుల నేపథ్యంలో కృష్ణానదిలో నిర్వహించే తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ కృష్ణానదిలో ప్రతికూల పరిస్ధితుల కారణంగా దీన్ని రద్దు చేశారు.
కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల నదీ విహారానికి బ్రేక్ పడింది. కృష్ణానదిలో భారీ వరద ప్రవాహం కారణంగా ఈ ఏడాది తెప్పోత్సవం నిర్వహించరాదని అధికారులు నిర్ణయించారు. దానికి బదులుగా నది ఒడ్డున హంస వాహనం ఉంచి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు పూజాది కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. పులిచింతల నుంచి లక్ష క్యూసెక్కుల వరద నీరు రావడంతోనే నదీ విహారం కు సాధ్యపడదని జల వనరుల శాఖ కలెక్టర్ కు రిపోర్ట్ అందింది. దీంతో తెప్పోత్సవానికి అనుమతివ్వడం లేదని అధికారులు తెలిపారు.
కృష్ణానది లో వరద ప్రవాహం కొనసాగుతుండడం తో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల నదీ విహారం నిర్వహించడం సాధ్యం కాదని తేలినట్లు కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. పులిచింతల నుంచి లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుందని, మూడు రోజుల పాటు నదిలో ప్రవాహం కొనసాగుతున్నందున స్వామి వార్ల నదీ విహారం చేపట్టలేకున్నట్లు ఆయన వెల్లడించారు. కేవలం దుర్గాఘాట్ లో హంస వాహనంపై స్వామి వార్ల ఉత్సవ మూర్తులను ఉంచి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. స్వామి వార్ల పూజాది కార్యక్రమాలు తిలకించేందుకు భక్తులకు ప్రకాశం బ్యారేజి, పున్నమిఘాట్, ఫ్లై ఓవర్, దుర్గాఘాట్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వేలాది మంది తెప్పోత్సవాన్ని తిలకించేందుకు వస్తారు కాబట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.