దుర్గ గుడిలో తాంత్రిక పూజల వ్యవహారం...అన్నీ వివాదాలే...అంతా గందరగోళమే...
విజయవాడ దుర్గ గుడిలో తాంత్రిక పూజల వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. అయితే రహస్య పూజలు జరిగాయంటూ మీడియాల్లో ఎన్నికథనాలు వెలువడుతున్నా ఈవో సూర్యకుమారి మాత్రం ఆ విషయాన్ని అంగీకరించడం లేదు. అయితే తాజాగా వెలుగు చూసిన దుర్గ గుడి సిసి కెమెరాల్లోని మరిన్ని విజువల్స్ పూజలు జరిగాయన్న వాదనలనే బలపరుస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
డిసెంబర్ 26 రాత్రి...అసలు ఏం జరిగింది...ఆరోజు రాత్రి 10.30 నిమిషాలకు అంతరాలయంలోకి అనధికార పూజారి రాజా వెళ్లినట్లు సీసీ కెమెరా ఫుటేజ్ తేల్చేసింది. పైగా అతడు తాంత్రిక పూజల్లో వినియోగించే గుమ్మడికాయ, ఇతర పూజాసామాగ్రిని తీసుకెళ్తున్నట్టు అందులోని దృశ్యాల నిర్థారిస్తుండటం గమనించాల్సిన విషయం.
మరోవైపు ఆలయ కమిటి కూడా పూజలు జరిగాయని చెబుతుండటంపై సిఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరగకుండానే ఇలా మాట్లాడటంపై కోపగించిన సిఎం ఇలా అయితే పాలక మండలిని రద్దు చేస్తాననడం సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు ఈ వివాదంపై శుక్రవారం నుంచి నిజనిర్ధారణ కమిటి విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కమిటి...విచారణ...
విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో డిసెంబర్ 26 రాత్రి ఆలయ పూజా వేళలు ముగిసిన అనంతరం అర్ధరాత్రి రహస్యంగా తాంత్రిక పూజలు చేశారనే ఆరోపణలపై నిజనిర్ధారణ కమిటీ శుక్రవారం లేదా శనివారం విచారణ ప్రారంభించనున్నది. ఈ అంశంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు దేవాదాయశాఖ కమిషనర్ అనూరాధ నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ ఆగమ సలహా మండలి చైర్మన్, కృష్ణ యజుర్వేద పండితులు చిర్రావూరి శ్రీరామశర్మ, దుర్గగుడి మాజీ ఈవో, ప్రస్తుతం పెనుగంచిప్రోలు ఈవోగా పనిచేస్తున్న మంచనపల్లి రఘునాథ్లను ఈ కమిటీలో నియమించింది.
Recommended Video


రెండు నివేదికలు...
అసలు డిసెంబర్ 26 వ తేదీ రాత్రి అసలు ఆలయంలో ఏం జరిగింది? ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఏమైనా పూజలు జరిగాయా? ఇందులోని లోగుట్టు ఏమిటి? వివాదానికి దారితీసిన పరిస్థితులేమిటి? అనే విషయాలను ఈ కమిటీ విచారించి నిజానిజాలు నిగ్గుతేల్చి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు పోలీసు అధికారులు సైతం దుర్గగుడి ఘటనలపై వారి పరిధిలో విచారణ జరుపుతారు. ఈ రెండు నివేదికల సిద్ధమైన తర్వాత ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం గుర్తించిన వాస్తవాలను ప్రజలకు తెలియచెప్పే అవకాశం ఉంది.

పాలకవర్గంపై...సిఎం ఆగ్రహం...
ఈ మొత్తం వ్యవహారంపై స్వయంగా దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో విజయవాడ నగర తెదేపా అధ్యక్షుడు, శాసనమండలిలో ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న గురువారం ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నియమించిన పాలకమండలి ప్రభుత్వానికే ఇబ్బందులు తెచ్చిపెట్టడం ఏమిటంటూ సీఎం ప్రశ్నించినట్లు సమాచారం. ఏ ఆధారాలతో పూజలు జరిగాయని పాలకమండలి మాట్లాడుతోందంటూ ఆగ్రహించారు. ఇలా అయితే పాలకవర్గాన్ని రద్దు చేస్తానని హెచ్చరించినట్టు తెలిసింది.

అధికారులు...పూజారులు...చర్యలు
మరో వైపు దుర్గగుడి ఆలయ ప్రధాన పూజారి బద్రీనాథ్ సెలవుపై వెళ్లారు. ఈ వ్యవహారంపై ఆ రోజు విధుల్లో ఉన్న ఏఈవో తిరుమలరావు, సూపరిండెంట్ గోపీ, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహారావుకు కార్యనిర్వహణాధికారి సూర్యకుమారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. క్యూలైన్ ఇన్స్పెక్టర్ చెన్నకేశవరావును బదిలీ చేశారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్కుమార్ను విజయవాడ దుర్గగుడి కార్యనిర్వహణాధికారి సూర్యకుమారి కలిసి ఆలయ ఘటనలపై వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల దుర్గగుడిలో నిబంధనలు విరుద్ధంగా కొన్ని వ్యవహారాలు చోటుచేసుకున్నట్లు వచ్చిన వార్తలపై సిఎస్ దినేష్కుమార్ ఆమెపై పలు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. అలాగే సూర్యకుమారి స్థానంలో ఐఆర్ఎస్ అధికారి కోటేశ్వరమ్మను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు కోటేశ్వరమ్మ డిప్యూటేషన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె మరో పది రోజుల్లో ఏపీ ప్రభుత్వ సర్వీసుల్లోకి కోటేశ్వరమ్మ వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications