టీటీడీ పై లాజిక్ మిస్సయిన పవన్ - 'లెక్క' తేల్చాల్సింది అక్కడే..!!
తిరుపతి తొక్కిసలాట ఘటన పై పవన్ సీరియస్ గా స్పందించారు. తిరుమలలో వ్యవస్థ ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేసారు. అధికారుల పై సీరియస్ అయ్యారు. తిరుమలలో విఐపీ సంస్కృతి కట్టడి చేసి..సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేసారు. కానీ, అది అమలు కావాల్సింది ఎక్కడ నుంచి. తిరుపతి వచ్చి చెబుతున్న పవన్.. నిర్ణయం తీసుకోవాల్సిన మంత్రి వర్గ భేటీలో ఈ అంశం ఎందుకు చెప్పటం లేదనే ప్రశ్న వస్తోంది. సీఎంఓ మొదలు కింది స్థాయి వరకు సిఫార్సులు లేకుండా ఒప్పించగలరా. భక్తులు కోరుకుంటోంది ఇదే.
పవన్ వ్యాఖ్యలతో
తిరుమలలో వీఐపీలకు లభిస్తున్న ప్రాధాన్యత పైన పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. టీటీడీ అధికా రులు వీఐపీలకు కాకుండా సామాన్య భక్తులకు సేవలు అందించాలని సూచించారు. కానీ, పవన్ అక్కడే అసలు విషయం విస్మరించారు. టీటీడీకి వచ్చే వీఐపీలు, సిఫార్సుల లేఖల్లో అధిక శాతం ప్రభుత్వంలోని వారి నుంచే వస్తున్నాయి. మంత్రులు, అధికారంలో ఉన్న పార్టీల నేతలు తమ అనుయాయులతో కలిసి తిరుమల దర్శనానికి పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. వీరి పైన టీటీడీకి నియంత్రణ ఉండదు. వీరిని నియంత్రించాల్సింది ప్రభుత్వమే. అంటే సీఎంగా చంద్రబాబు లేదా డిప్యూటీ సీఎంగా పవన్.

పవన్ ఆ లెక్క తేల్చుతారా
వీఐపీలకు ప్రాధాన్యత గురించి సీరియస్ అయిన పవన్.. తాను డిప్యూటీ సీఎం అయిన తరువాత తన పేషీ నుంచి టీటీడీకి సిఫార్సు లేఖల తన అధికారులు జారీ చేసారా లేదో గుర్తించాలి. అదే విధంగా తన పార్టీ నుంచి మంత్రులుగా ఉన్నవారు.. ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో సిఫార్సు లేఖలు ఇస్తున్నారో లెక్క తేల్చాలనే డిమాండ్ వినిపిస్తోంది. వీరిని నియంత్రించటం ద్వారా పవన్ ఈ వీఐపీలకు ప్రాధాన్యత.. సిఫార్సు లేఖల పైన కేబినెట్ సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంటుంది. అయితే, ఎన్నో సంవత్సరాలుగా సిఫార్సు లేఖల వ్యవహారం టీటీడీలో ఒక ఆనవాయితీగా మారిపోయింది. టీటీడీ అధికారులు అధికార పార్టీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వక పోతే ప్రభుత్వం నుంచే వారికి వార్నింగ్ లు వస్తాయి.
పవన్ అక్కడి నుంచే
విఐపీ సంస్కృతి కట్టడి ముందుగా ముఖ్యమంత్రి కార్యాలయం.. డిప్యూటీ సీఎం ఆఫీసు నుంచే ప్రారంభం కావాలని భక్తులు కోరుకుంటున్నారు. సిఫార్సు లేఖల పైనే ప్రతీ రోజు తిరుమలలో వేలాది మంది బ్రేక్ దర్శనం చేసుకుంటున్నారు. ఆ సమయంలో సాధారణ భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిందే. టీటీడీలో కీలక బాధ్యతలు తమ విధేయులకే అప్పగించటం ద్వారా సంబంధిత వారు వస్తే తిరుమలలో సకల సౌకర్యాలు అందుతున్నాయి. ఘటన జరిగిన సమయం లో పవన్ సీరియస్ గా స్పందించిన తీరు.. క్షమాపణలు కోరిన విధానం కొంత వరకు భక్తులకు ఉప శమనం కలిగినా..అసలు దర్శనాల విషయంలో సీఎంఓ - మంత్రివర్గం నుంచే పవన్ మార్పు తెచ్చే ప్రయత్నం చేయగలరా అనేది భక్తులు వేచి చూస్తున్నారు. వచ్చే మంత్రివర్గ భేటీలో పవన్ టీటీడీ గురించి ఏం మాట్లాడబోతున్నారనేది ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications