తిరుమల, పళని వెళ్లే భక్తులకు అరుదైన అవకాశం..!!
తిరుపతి - పళనికి పెద్ద సంఖ్యలో వెళ్లే భక్తులకు ఆర్టీసీ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ రెండు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య భక్తులకు వెసులుబాటు కలిగించేలా ఆర్టీసీ సర్వీసు ప్రారంభం అయింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొద్ది రోజుల క్రితం పళని సందర్శనకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడి భక్తులు తమకు తిరుపతి నుంచి బస్సు సౌకర్యం కల్పించాలని అభ్యర్ధించారు. దీంతో, ఇప్పుడు భక్తుల కోరిక మేరకు తిరుపతి - పళని మధ్య బస్సు సేవలను ప్రారంభించారు. ఈ బస్సు వేళలు.. ధరలను ఆర్టీసీ ఖరారు చేసింది.
తిరుపతి - పళని మధ్య
కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి కొలువైన తిరుపతి - పళని మధ్య రెండు లగ్జరీ బస్సులతో సర్వీసులు ప్రారంభమయ్యాయి. నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించే ఆధ్మాత్మిక క్షేత్రాలైన తిరుపతి - పళని మధ్య ఏపీఎస్ ఆర్టీసీ కొత్తగా బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ ఫిబ్రవరిలో తమిళనాడులో షష్ట షణ్ముఖ యాత్ర నిర్వహించారు. ఆ సమయంలో యాత్రలో భాగంగా పళని కొండపై వెలసిన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు. ఆ సమయంలో అక్కడి భక్తులు పళని నుంచి తిరుపతికి వెళ్లాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. మూడు బస్సులు మారి వెళ్లాల్సి వస్తుందని వివరించారు. నేరుగా తిరుపతికి బస్సు సౌకర్యం కల్పించాలని పవన్ ను కోరారు.

భక్తుల కోరిక మేరకు
దీంతో, వెంటనే బస్సు ఏర్పాటు పైన పవన్ వారికి హామీ ఇచ్చారు. ఈ అంశం పైన పవన్ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించారు. సీఎం ఆమోదంతో వెంటనే బస్సు ఏర్పాటు పైన ఆర్టీసీ కి ఆదేశాలు అందాయి. కాగా, ఇప్పుడు తిరుపతి నుంచి పళనికి, పళని నుంచి తిరుపతికి ఒకే సమయంలో ఈ రెండు బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుపతి, పళని మధ్య 505 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రయాణం దాదాపు 11 గంటలపాటు సాగుతుంది. తిరుపతి నుంచి రాత్రి 8 గంటల సమయంలో బయలుదేరే బస్సు చిత్తూరు, క్రిష్ణగిరి, ధర్మపురి మీదుగా మరుసటి రోజు ఉదయం 7 గంటలకు పళని చేరుకుంటుంది.
వేళలు - ధరలు
అదే విధంగా పళని నుంచి రాత్రి 8 గంటల సమయంలో మొదలయ్యే బస్సు.. తిరుపతికి మరుసటి రోజు ఉదయం 7 గంటల సమయంలో చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. తిరుపతి పళని బస్సు సర్వీసులో పెద్దలకు రూ.680, చిన్నపిల్లలకు రూ. 380గా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇది కలియుగ దైవం వెంకన్న భక్తులకు, అలాగే మురగన్ ఆరాధించే భక్తులకు అనుసంధానంగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల భక్తుల మధ్య సుహృ ద్బావ వాతావరణం ఏర్పాటుకు ఇది బాటలు వేస్తుందని మంత్రి రాం ప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ కొత్త సర్వీసులతో నిత్యం వేలాది మంది ఇప్పటి వరకు మూడు బస్సులు మారటం ద్వారా పడుతున్న ఇబ్బందులు తొలిగిపోనున్నాయి. ఈ రూటులో సర్వీసులు రానున్న రోజుల్లో డిమాండ్ కు అనుగుణంగా పెంచుతామని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications