ఎంసెట్ వార్: కోర్టుకెళ్తామని గంటా, ఇక్కడ రాయాలని జగదీష్ రెడ్డి
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఎంసెట్ వివాదం ఇంకా ముదురుతోంది. ఇరు రాష్ట్రాలో ఏ రాష్ట్రం కూడా దిగిరావడానికి సిద్ధంగా లేదు. ఈ స్థితిలో తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధపడింది. ఈ విషయాన్ని ఎపి మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఢిల్లీలో చెప్పారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే కోర్టును ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు.
సమస్య పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో అన్నారు. విభజన చట్టం అమలుకు తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై, భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పనపై గంటా శ్రీనివాస రావు సోమవారంనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మాట్లాడారు.

కాగా, తమ రాష్ట్రంలో సీటు కోరుకునే ఆంధ్ర విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్నే రాయాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం ఎంసెట్ నిర్వహించే హక్కు తెలంగాణకే ఉందని ఆయన మంగళవారం మీడియాతో అన్నారు. ఎపి ప్రభుత్వం తమతో సంప్రదించకుండా ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆయన విమర్శించారు
సమస్యను పరిష్కరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆయన అన్నారు. అవసరమైతే ఉమ్మడి పరీక్షలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎంసెట్ పరీక్ష షెడ్యూల్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రకటించిందని ఆయన సోమవారం విమర్శించిన విషయం తెలిసిందే. ఇరువురు విద్యామంత్రులు గంటా శ్రీనివాస రావు, జగదీష్ రెడ్డి విద్యామంత్రుల సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చారు.












Click it and Unblock the Notifications