ఎబోలా వ్యాధి: శంషాబాద్ విమానాశ్రయంలో అలర్ట్
హైదరాబాద్: తమిళనాడు రాజధాని చెన్నైలో ఎబోలా అనుమానిత కేసును గుర్తించడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్పోర్టుల్లో ఎబోలా అలర్ట్ను ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో నాలుగు ఎబోలా స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఎబోలా నిర్దారణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలను ఎబోలా వైరస్పై చైతన్య పరచడం వల్లే ఈ వైరస్ బారిన పడకుండా చూడగలమని అధికారులు అబిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఆఫ్రికా దేశాలలో వందలమంది ప్రాణాలను బలితీసుకుంటూ, పాశ్చాత్య దేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్ భయం ఇప్పుడు చెన్నైని పట్టుకుంది. ఎబోలా వైరస్ వ్యాపించిన దేశాల నుంచి ఎవరైనా వస్తున్నారంటేచాలు అన్ని దేశాల వారు భయపడుతున్నారు. అలాగే ఈరోజు ఆఫ్రికా నుంచి ఓ 26 ఏళ్ల యువ ప్రయాణికుడు చెన్నై వచ్చారు. .అతనికి ఎబోలా వైరస్ సోకిందని అనుమానించారు.
గినీ దేశం నుంచి ఆ యువకుడు వచ్చారు. వెంటనే అతనిని అత్యవసర వైద్య పరీక్షల కోసం చెన్నైలోని రాజీవ్ గాంధీ హాస్పిటల్కి తరలించారు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, అతనికి ఎటువంటి వైరస్ సోకలేదని నిర్ధారించారు. ఎబోలా వైరస్కు సంబంధించిన అన్ని పరీక్షలు చేశామని, ఎబోలాకు సంబంధించిన ఎటువంటి లక్షణాలూ అతనికి లేవని రాజీవ్ గాంధీ ఆస్పుత్రి డాక్టర్ రఘునందన్ చెప్పారు. దాంతో ఇక్కడి అధికారులు సైతం ఊపిరి పీల్చుకున్నారు.