ఏపీలో దొంగ ఓట్లపై ఈసీ కొరడా-5.64 లక్షల అనర్హుల తొలగింపు, అధికారుల సస్పెన్షన్లూ..
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నకిలీ ఓట్లు, అనర్హులను లిస్ట్ లో చేర్చడం, అర్హులను తొలగించడం చకచకా జరిగిపోయాయి. దీంతో భారీ ఎత్తున అనర్హులు ఓటర్ల జాబితాల్లోకి వచ్చేశారు. రాజకీయ పార్టీల నేతలు తమకు వీలైన చోట్ల ఇలా భారీ ఎత్తున నకిలీ ఓట్లను జాబితాల్లోకి చేర్పించేశారు. తిరిగి వారే తమకు ఓటేయరని భావించిన వారి పేర్లు తొలగించాలంటూ దరఖాస్తులు చేయడం కూడా మొదలుపెట్టాయి. ఇలా ఏపీలో దాదాపు 15 లక్షల నకిలీ ఓట్లు ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయి.
ఓటర్ల జాబితాలో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాయి. ఇలా చేస్తున్న ఫిర్యాదుల ప్రకారం 14.48 లక్షల మంది అనర్హులు జాబితాల్లో ఉన్నట్లు రాజకీయ పార్టీలు ఆరోపించాయి. దీనిపై విచారణ జరిపిన ఎన్నికల సంఘం అధికారులు.. తాజాగా 5.64 లక్షల అనర్హుల్ని తొలగించారు. అంటే కేవలం మూడో వంతు మాత్రమే. మిగతా అభ్యంతరాలు ఉన్న ఓట్లు సరైనవే అని ఈసీ భావించినట్లు తెలుస్తోంది.

అలాగే నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యర్ధుల ఓట్లు తొలగించమని కోరుతూ గంపగుత్తగా ఫామ్ 7లు దాఖలు చేసిన వ్యవహారంలో కాకినాడ సిటీ పరిధిలో 13 కేసులు నమోదయ్యాయి. అలాగే పర్చూరులో 10 కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు గుంటూరు పశ్చిమ, చంద్రగిరి, బనగానపల్లెలోనూ ఒక్కో కేసు నమోదైంది. అలాగే ఉరవకొండ సీటులో ఇద్దరు ఈఆర్వోలు, ప్రొద్దుటూరులో ఓ ఈఆర్వో, పర్చూరులో ఓ ఏఈఆర్వో, ఓ సీఐ, ముగ్గురు ఎస్సైల్ని కూడా ఈసీ సస్పెండ్ చేసింది. అలాగే రాష్ట్రంలో 50 మంది బీఆల్వోల్ని కూడా సస్పెండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి విపక్ష టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ఏపీ సీఈవో ఈ చర్యలు తీసుకున్నట్లు తిరిగి వారికి ప్రత్యుత్తరం ఇచ్చారు.












Click it and Unblock the Notifications