AP Election: జనసేనకు హైకోర్టులో ఊరట- ఈసీ కీలక హామీ..!
ఏపీలో జనసేనకు కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును ఆ పార్టీ పోటీ చేయని స్ధానాల్లో స్వతంత్రులకు కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈసీ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై వెంటనే హైకోర్టు విచారణ చేపట్టింది. ఈసీ అభిప్రాయం కోరింది. అదే సమయంలో కూటమిలో జనసేన భాగస్వామి అయిన టీడీపీ కూడా ఈ పిటిషన్లో ఇంప్లీడ్ అయింది.
జనసేనకు గతంలో ఈసీ కామన్ సింబల్ గా గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది. అయితే జనసేన పోటీ చేయని స్ధానాల్లో మాత్రం గాజు గ్లాస్ ను ఫ్రీ సింబల్ గా ఉంచింది. దీంతో రిటర్నింగ్ అధికారులు గాజు గ్లాస్ గుర్తును జనసేన పోటీలో లేని చోట్ల స్వతంత్రులకు కేటాయించడం మొదలుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలా 40కి పైగా స్దానాల్లో రిటర్నింగ్ అధికారులు ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తు ఇచ్చేశారు. ఇందులో టీడీపీ రెబెల్స్ కూడా ఉన్నారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

జనసేన పిటిషన్ పై విచారణ సందర్బంగా హైకోర్టు ఈసీ అభిప్రాయం కోరింది. అలా గుర్తులు ఎలా ఇచ్చేస్తారని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ఈసీ.. 24 గంటల్లో గాజు గ్లాస్ గుర్తు సమస్యను పరిష్కరిస్తామని హైకోర్టుకు హామీ ఇచ్చింది. దీంతో హైకోర్టు రేపటికి విచారణను వాయిదా వేసింది. ఈసీ స్పందన ఆధారంగా రేపు హైకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. మరోవైపు గాజు గ్లాస్ గుర్తుతో పాటు దాన్ని పోలిన గుర్తులు కూడా ఏపీ ఎన్నికల్లో హల్ చల్ చేస్తున్నాయి. వీటిపై జనసేన ఆందోళన వ్యక్తం చేస్తోంది.












Click it and Unblock the Notifications