రాజధాని: ప్రభుత్వానికి ఊరట, షరతులతో ఈసీ ఓకే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూమిపూజకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి పచ్చ జెండా ఊపింది. ఏపీలోని తొమ్మిది జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో భూమిపూజ, బహిరంగ సభ, వ్యవసాయ వర్సిటీ శంకుస్థాపన తదితరాలపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే.
దాంతో భూమి పూజకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వం ఈసికి లేఖ రాసింది. 5న ఎన్జీ రంగా వర్సిటీ శంకుస్థాపన, ఆరో తేదీన భూమి పూజ, 8న బహిరంగ సభ, జన్మభూమి - మాఊరు తదితర కార్యక్రమాలను యథాతథంగా జరుపుకునేందుకు ఈసీ ఆమోదం తెలిపింది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొన్ని నిబంధనలకు లోబడి వీటిని జరపాల్సి ఉంటుంది. ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. పథకాలు ప్రకటించకూడదు.
8న మహాసంకల్ప సభ
రాజధాని అమరావతిలో 6వ తేదీ ఉదయం 8.49 గంటలకు భూమిపూజ చేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిందని మంత్రులు పీ నారాయణ, పత్తిపాటి పుల్లారావు తెలిపారు. తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈనెల 6వ తేదీన భూమిపూజ యథాతథంగా జరుగుతుందన్నారు. అలాగే 8వ తేదీన బహిరంగ సభ కూడా నిర్వహిస్తామన్నారు. అయితే 5వ తేదీన లాంఫాంలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జరగాల్సిన శంకుస్థాపన మాత్రం అనధికారికంగా వాయిదాపడిందన్నారు.
భూ సమీకరణ ద్వారా రైతులు గురువారం నాటికి 19,600 ఎకరాలు ఇచ్చారన్నారు. రైతులే భూమిని చదునుచేసి ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకులు విమర్శలు మాని సహకరిస్తే ప్రజల మన్ననలు పొందుతారని సూచించారు.
లేకుంటే ప్రజల దృష్టిలో ఫల్స్గా మిగిలిపోతారన్నారు. రైతుల అభిరుచే ధ్యేయంగా రాజధాని నిర్మాణం ఉంటుందన్నారు. ఆధార్, రేషన్ కార్డులు సక్రమంగా లేనందున 1705 ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమకాలేదని పుల్లారావు తెలిపారు.