జనసేనకు ఈసీ గుర్తింపు: పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు?
న్యూఢిల్లీ: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీగా గుర్తింపు ఇచ్చింది. పార్టీకి ఈసీ గుర్తింపు వచ్చిన తర్వాత పవన్ కార్యాచరణ ప్రకటిస్తారని పార్టీ కొద్ది రోజుల క్రితం ప్రకటనలో తెలిపింది. 24, నవంబర్ 2014 నుండి రాజకీయ పార్టీగు గుర్తిస్తున్నట్లు ఈసీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కార్యాచరణ పైన అందరి దృష్టి ఉందని చెప్పవచ్చు. జనసేనకు గుర్తింపు రావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ 29బీ, 29సీ, 1951 కింద రాజకీయ పార్టీ గుర్తింపు ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే కామన్ సింబల్ పైన కూడా సూచన ఇచ్చింది. జనసేన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకుంది. రిజస్టర్ పార్టీగా నమోదైన నేపథ్యంలో కామన్ సింబల్ను ఎంచుకునే అవకాశాన్ని జనసేన పార్టీకి ఈసీ కల్పించింది. దీంతో మరో రెండుమూడు రోజుల్లో పార్టీ గుర్తును ఎలక్షన్ కమిషన్కు పంపించేందుకు పవన్ అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ - బీజేపీ కూటమికి మద్దతు...
సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. ఆయన పార్టీ ఎన్నికలలో పోటీ చేయలేదు. అయితే, తెలుగుదేశం - భారతీయ జనతా పార్టీల కూటమికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మద్దతిచ్చారు. ఆ పార్టీల తరఫున పవన్ కల్యాణ్ విస్తృతంగా పర్యటిచారు.
ఎన్నికల ప్రచారంలో నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భారత ప్రధాని నరేంద్ర మోడీలతో కలిసి కూడా సభలలో పాల్గొన్నారు. వారితో కలిసి, విడిగా ఆ పార్టీల అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేశారు. ఆయన ప్రచారం కూడా తమ విజయానికి ఉపయోగపడిందని స్వయంగా చంద్రబాబు, మోడీలు కూడా ప్రశంసించారు.

మోడీ, చంద్రబాబులను నిలదీస్తానని...
ఎన్నికల ప్రచారం పవన్ కల్యాణ్ విపక్షాల పైన నిప్పులు చెరగడంతో పాటు తాను ఇప్పుడు మద్దతిస్తున్న టీడీపీ, బీజేపీలు అధికారంలోకి వస్తే ప్రజా వ్యతిరేక పనులకు పాల్పడితే తాను నరేంద్ర మోడీ, చంద్రబాబులను నిలదీస్తానని ప్రకటించారు.
మోడీ, చంద్రబాబు పనితీరుపై సంతృప్తి!
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆరు నెలల నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు పని తీరుపై సంతృప్తిగా ఉన్నట్లు కొద్ది రోజుల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా కనిపిస్తోంది. కాగా, ఎన్నికల సమయంలో కనిపించిన పవన్ మళ్లీ కనిపించడం లేదనే విమర్శల పైన జనసేన కొద్దిరోజుల క్రితం స్పందించింది. పార్టీకి ఈసీ గుర్తింపు వచ్చాక పవన్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కార్యాచరణ పైన అందరి దృష్టి పడింది.












Click it and Unblock the Notifications