ఏపీలో జూలై 6న ఎమ్మెల్సీ ఎన్నిక - మండలి రద్దు పెండింగ్ లో ఉన్నా- వైసీపీ అభ్యర్ధిగా డొక్కా ?
ఏపీలో శాసన మండలి ఎన్నికల నగారా మోగింది. మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామాతో ఖాళీ అయిన స్ధానానికి ఆరునెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. శాసనసభ్యుల కోటాలో ఖాళీ అయిన ఈ స్ధానం కోసం పోటీలో ఉండే అభ్యర్ధులను ఎమ్మెల్యేలే ఎన్నుకోవాల్సి ఉంటుంది. జూలై 6న ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు.

ఈసీ షెడ్యూల్ విడుదల...
ఏపీ శాసనమండలిలో డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 18న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువరించనుంది. జులై 6న పోలింగ్ నిర్వహించనుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 25 వరకు గడువు ఇచ్చింది. 26న నామినేషన్లను పరిశీలన చేపట్టనున్నారు. 29 వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. జులై 6న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

మండలి రద్దు పెండింగ్ లో ఉండగానే...
రాజధాని బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపిందన్న కారణంతో శాసనమండలి రద్దుకు తీర్మానం చేసి ఏపీ అసెంబ్లీ కేంద్రానికి పంపింది. ఈ ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్ లో ఉండగానే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ జారీ కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో ఏపీ శాసనమండలి రద్దు ప్రతిపాదనను కేంద్రం ఆమోదిస్తే మండలి రద్దవుతుంది. ఇలాంటి పరిస్ధితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ అవసరమా అన్న చర్చ జరుగుతోంది. అయితే మండలి రద్దుకు సంబంధించి కేంద్రం ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎన్నికల సంఘం న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాతే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని తెలుస్తోంది.
Recommended Video

వైసీపీ అభ్యర్ధిగా డొక్కా... ?
గతంలో టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజధాని బిల్లుల వ్యవహారంలో అసెంబ్లీతో మండలి విభేదించిన నేపథ్యంలో ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. వైసీపీ సిద్ధాంతాల ప్రకారం టీడీపీకి రాజీనామా చేసిన వారినే పార్టీలో చేర్చుకుంటామన్న నిబంధన ఉండటంతో అప్పట్లో డొక్కా తన రాజీనామాను ఛైర్మన్ కు పంపడం, దాన్ని ఆమోదించడం జరిగిపోయాయి. అయితే ఎలాగో మండలి రద్దు అవుతుందన్న ధీమాలో ఉన్న టీడీపీ... డొక్కా రాజీనామాను ఆమోదించింది. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేల బలం ప్రకారం చూస్తే వైసీపీకి ఈ సీటు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications