గ్రహణాల ప్రభావం: ఆ రెండు రోజులూ శ్రీవారి ఆలయం మూసివేత, సర్వ దర్శనాలు మాత్రమే
తిరుపతి: సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా గ్రహణ సమయంలో రెండు రోజులపాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది. అక్టోబర్ 25న సూర్య గ్రహణం కారణంగా ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు.
ఇక నవంబర్ 8న చంద్ర గ్రహణం కారణంగా ఉదయం 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీడీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ రెండు రోజులపాటు వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవారి ట్రస్ట్ ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ. 300), ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
అంతేగాక, ఈ రెండు రోజులపాటు గ్రహణం వీడిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి కేవలం సర్వదర్శనం భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు పేర్కొన్న టీటీడీ.. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరింది.
అహ్మదాబాద్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి ఇస్తాం- టీటీడీ చైర్మన్కు గుజరాత్ సీఎం హామీ
అహ్మదాబాద్లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి అనువైన భూమి కేటాయిస్తామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ పటేల్ హామీ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, పాలక మండలి సభ్యులు కేతన్ దేశాయ్తో పాటు సోమవారం ముఖ్యమంత్రి ని కలిశారు.సీఎంకు శ్రీవారి ప్రసాదం అందించి శాలువలతో సత్కరించారు.
ఈ సందర్భంగా చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారానికి చేపట్టిన చర్యలను ముఖ్యమంత్రి కి వివరించారు. జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణం జరుగుతోందని, ఇటీవలే భువనేశ్వర్లో శ్రీవారి ఆలయం ప్రారంభించామన్నారు.
త్వరలోనే ముంబైలో స్వామివారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నామని చెప్పారు. గుజరాత్లో కూడా స్వామివారి ఆలయ నిర్మాణానికి టీటీడీకి ఉచితంగా భూమి కేటాయించాలని కోరారు. సుబ్బారెడ్డి ప్రతిపాదన పట్ల గుజరాత్ ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అధికారులతో చర్చించి టీటీడీకి అనువైన ప్రదేశంలో అవసరమైనంత భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు.